- 50 లక్షలకు చేరిన ఐటీ జాబ్స్
- ఎగుతులు 17శాతం ఆన్ లైన్ బిజినెస్ 39శాతం
వెలుగు బిజినెస్ డెస్క్: మన ఐటీ ఇండస్ట్రీ గత పదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా 15.5% గ్రోత్ను 2021–22లో సాధించింది. అంతకు ముందు 2011లో ఒకసారి ఇంత గ్రోత్ రికార్డయింది. ఐటీ కంపెనీల రెవెన్యూ ఏకంగా 227 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.17 లక్షల కోట్లు) అందుకుంది. దీంతో 2026 నాటికి ఏటా 11 నుంచి 14 శాతం గ్రోత్తో 350 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.26 లక్షల కోట్లు) రెవెన్యూ సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. ఈ డేటాను మంగళవారం నాస్కామ్ రిలీజ్ చేసింది. ఐటీ ఇండస్ట్రీలోని అన్ని సెగ్మెంట్స్ రెండంకెల గ్రోత్ చూపించినట్లు నాస్కామ్ వెల్లడించింది. ఐటీ ఇండస్ట్రీ ఎగుమతులు (హార్డ్వేర్తో కలిపి) 17.2% పెరిగాయి. ఈ ఎగుమతులు 178 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మన దేశపు మొత్తం సర్వీసెస్ ఎగుమతుల్లో ఐటీ ఎగుమతుల వాటా 51 శాతానికి చేరింది.
డిజిటల్ ఇన్ఫ్రానే కారణం...
ఐటీ ఇండస్ట్రీ దేశంలో ఎదగడానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా సాయపడింది. దేశంలోని పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ముందుంటున్నాయి. దీంతో దేశీయ డిమాండ్ కూడా పుంజుకుంటోంది. ఐటీ ఇండస్ట్రీ దేశీయ రెవెన్యూ 2019 తో పోలిస్తే రెట్టింపయి 50 బిలియన్ డాలర్లకు చేరినట్లు నాస్కామ్ రిపోర్టు తెలిపింది. ఆన్లైన్ బిజినెస్(ఈ–కామర్స్) సెగ్మెంట్ 39 శాతం గ్రోత్తో 2022లో 79 బిలియన్ డాలర్ల రెవెన్యూను అందుకోవడం విశేషం. డిజిటల్ రెవెన్యూ కూడా 32 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లయింది.
50 లక్షలకు చేరిన ఐటీ జాబ్స్....
దేశంలోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 50 లక్షలు దాటింది. దీంతో డిజిటల్ టాలెంట్కు మన దేశమే గ్లోబల్ హబ్గా మారిందని కూడా రిపోర్టు వెల్లడించింది. 2022లో ఐటీ ఇండస్ట్రీ 4.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది. మన దేశంలోని ఐటీ ఇండస్ట్రీలో 36% మంది (అంటే 18 లక్షలు) మహిళలు పనిచేస్తున్నారని నాస్కామ్ రిపోర్టు తెలిపింది. ప్రతి ముగ్గురు ఉద్యోగులలో ఒకరు డిజిటల్ స్కిల్స్ తెలుసున్న వారని, దేశంలోని డిజిటల్ టెక్ టాలెంట్ పూల్16 లక్షలకు చేరిందని వివరించింది. ఈ డిజిటల్ టెక్ టాలెంట్ పూల్ ఏటా 25 శాతం చొప్పున పెరుగుతున్నట్లు తెలిపింది. 2022లో ఐటీ ఇండస్ట్రీలోని 2.8 లక్షల మంది ఉద్యోగులకు కొత్త స్కిల్స్ నేర్పించినట్లు పేర్కొంది. 2022లో డిజిటల్ టెక్నాలజీ సెగ్మెంట్లోనే ఎక్కువ మెర్జర్లు, ఎక్విజిషన్లు చోటు చేసుకున్నాయని, మొత్తం 290 మెర్జర్లు జరిగాయని నాస్కామ్ రిపోర్టు వెల్లడించింది.
మూడో పెద్ద స్టార్టప్ హబ్...
మన దేశం ప్రపంచంలోనే మూడో పెద్ద స్టార్టప్ హబ్గా మారింది. దేశంలో 25 వేల టెక్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. 42 స్టార్టప్లు ఇప్పటికే యూనికార్న్లుగా మారడం ఒక విశేషమైతే, 11 కంపెనీలు 2021లో ఐపీఓలకు రావడం మరో విశేషమని నాస్కామ్ రిపోర్టు ప్రస్తావించింది. ఒక్క 2021లోనే కొత్తగా 2,250 టెక్ స్టార్టప్లు దేశంలో ఏర్పాటయ్యాయని, ఇదే ఏడాదిలో రికార్డు లెవెల్లో 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్టార్టప్లు తెచ్చుకున్నాయని కూడా వెల్లడించింది.
2 వేల ప్రొడక్ట్ కంపెనీలు....
ప్రొడక్టుల రంగంలోనూ మన సాఫ్ట్వేర్ కంపెనీలు దూసుకెళ్తున్నాయని, 2 వేల సాఫ్ట్వేర్ ప్రొడక్టు కంపెనీలు, వెయ్యి ఎస్ఏఏఎస్ (శాస్) కంపెనీలు ఇక్కడ ఉన్నాయని నాస్కామ్ డేటా వివరించింది. దేశంలోని శాస్ కంపెనీలకు 2021లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది.
ఇనొవేషన్తో ఆర్ అండ్ డీ లో మరిన్ని పెట్టుబడులొస్తాయ్....
ఇనొవేషన్, పార్ట్నర్షిప్స్ ద్వారా డిజిటల్ కేపబిలిటీస్ పెంచుకుంటే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని నాస్కామ్ అభిప్రాయపడింది. అప్పుడు మరిన్ని ప్రొడక్టులు, ప్లాట్ఫామ్స్ తెచ్చే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. మన ఐటీ ఇండస్ట్రీకి క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు టాప్ ప్రయారిటీలుగా కొనసాగుతున్నాయని, క్వాంటమ్ టెక్నాలజీస్ వంటి కొత్త ఏరియాలలో సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్లను ఇండస్ట్రీ ఏర్పాటు చేయనుందని కూడా నాస్కామ్ రిపోర్టు తెలిపింది.
ఏ రకంగా చూసినా 2022 సంవత్సరం ఐటీ ఇండస్ట్రీ మర్చిపోలేనిది. అన్ని సెగ్మెంట్లలోనూ భారీ గ్రోత్ కనిపిస్తోంది. ఉద్యోగాలు బాగా పెరిగాయి. దేశపు ఎకనమిక్ గ్రోత్లో ఐటీ ఇండస్ట్రీ చురుగ్గా భాగం పంచుకుంటోంది. దేశాన్ని ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. టాలెంట్, టెక్నాలజీ, కొలాబరేషన్, ఇనొవేషన్.....నాలుగింటిపై ఫోకస్ పెడుతున్నాం. ‑ రేఖా ఎం. మీనన్ నాస్కామ్ ఛైర్ పర్సన్.