న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన ముంబై, కోల్కతాతో పాటు నోయిడాలో ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన కరోనా వైరస్ టెస్టింగ్ ఫెసిలిటీస్ను మోడీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంపై మోడీ పలు వ్యాఖ్యలు చేశారు.
‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంతో మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఇండియా మెరుగైన స్థితిలో ఉంది. లీడింగ్ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో డెత్ రేట్ చాలా తక్కువగా ఉంది. మన దేశంలో రికవరీ రేట్ చాలా ఎక్కువగా ఉంది. దేశంలో 11 వేలకు పైగా కరోనా ఫెసిలిటీస్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే పదకొండు లక్షలకుపైన ఐసోలేషన్ బెడ్స్ ఉన్నాయి. ఇండియాలో ప్రతి రోజూ 5 లక్షలకు పైగా టెస్టులు చేశారు. ప్రతి ఒక్క భారతీయుడిని కాపాడటమే లక్ష్యం. ఇప్పుడు లాంచ్ చేస్తున్న హై టెక్ ల్యాబ్లు మూడు సెంటర్స్కు అదనపు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇప్పుడిక రోజుకు 10 వేలకు పైగా టెస్టులు చేయొచ్చు. ఈ ల్యాబ్లను కరోనా టెస్టులకే పరిమితం చేయబోం. భవిష్యత్లో ఈ ల్యాబ్ల్లో డెంగ్యూ, హెచ్ఐవీ, హైపటైటిస్ లాంటి టెస్టులు చేయడానికి వాడుకోవాలి. కరోనా పై పోరులో మానవ వనరులను సంసిద్ధం చేయడమే అతి పెద్ద సవాల్గా మారింది’ అని మోడీ చెప్పారు.