ఇండియాకు పేస్ పరీక్ష!
వెల్లింగ్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా టఫ్ చాలెంజ్కు రెడీ అయింది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడి బేసిన్ రిజర్వ్ స్టేడియంలో శుక్రవారం మొదలయ్యే తొలి మ్యాచ్లో బలమైన న్యూజిలాండ్తో తలపడనుంది. టెస్ట్ చాంపియన్షిప్లో 360 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్న కోహ్లీసేనే పేపర్పై ఫేవరెట్గా కనిపిస్తున్నప్పటికీ హోమ్గ్రౌండ్లో కివీస్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఆట సాగుతున్న కొద్దీ ఫ్లాట్గా మారే వికెట్పై ఓపిగ్గా ఆడి ఇండియాను దెబ్బకొట్టాలని కేన్ విలియమ్సన్సేన భావిస్తోంది. చివరగా 2017 మార్చిలో సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన కివీస్ తర్వాత జరిగిన పది మ్యాచ్ల్లో ఐదింటిలో గెలిచింది. ఆస్ట్రేలియాలో 0–3తో సిరీస్ ఓటమి తర్వాత విమర్శల పాలైన బ్లాక్క్యాప్స్ టీమ్.. కోహ్లీసేనను ఓడించి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు గతేడాది ఆస్ట్రేలియాలో గెలిచినట్టుగా ఈసారి కివీస్లో సిరీస్ కైవసం చేసుకోవాలన్నది కోహ్లీసేన ప్లాన్. అయితే, అడ్డంగా వీచే గాలుల వల్ల బేసిన్ రిజర్వ్ గ్రౌండ్లో బ్యాట్స్మెన్, బౌలర్లకు కఠిన సవాల్ ఎదురవనుంది. బౌల్ట్, సౌథీ టాప్ క్లాస్ సీమ్ బౌలింగ్ను కాచుకోవడం కొత్త ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్కు సవాలే. షార్ట్ బాల్తో పరీక్ష పెట్టే లెఫ్టార్మ్ స్పీడ్స్టర్ నీల్ వాగ్నర్ గైర్హాజరు ఇండియాకు ప్లస్ పాయింటే. అతని ప్లేస్లో కైల్ జెమీసన్ అరంగేట్రం చేసే చాన్సుంది. పృథ్వీ, మయాంక్తో పాటు హనుమ విహారి టెక్నిక్కు కివీస్ పేసర్లు పరీక్ష పెట్టనున్నారు. ఒకవేళ యంగ్స్టర్స్ ఫెయిలైతే సీనియర్లు పుజారా, కోహ్లీ, రహానె జట్టు బాధ్యతను తీసుకునేందుకు రెడీగా ఉండాల్సిందే. ఇక, మ్యాచ్కు ముందు రోజే కివీస్ 12 ప్లేయర్లతో జట్టును ప్రకటించింది. నలుగురు పేసర్లతో బరిలోకి దిగనున్న కివీస్ తమ ఫస్ట్ చాయిస్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్లో ఎవరిని ఆడిస్తుందో చూడాలి. ఇండియా ఫైనల్ ఎలెవన్పై కోహ్లీ ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నాడు. కీపర్గా సాహా బరిలోకి దిగే చాన్సుండగా. పేస్ త్రయం బుమ్రా, షమీ, ఇషాంత్తో పాటు స్పిన్నర్ కోటాలో అశ్విన్, జడేజాలో ఒకరు తుది జట్టులో రానున్నారు.