హార్ముజ్ జలసంధిలో డ్రోన్ దాడి.. సముద్రంలో మునిగిన ఇండియన్ కార్గోషిప్..తీవ్రంగా ఖండించిన భారత్

హార్ముజ్ జలసంధిలో డ్రోన్ దాడి.. సముద్రంలో మునిగిన ఇండియన్ కార్గోషిప్..తీవ్రంగా ఖండించిన భారత్

హార్ముజ్ జలసంధిలో భారత్ కు చెందిన కార్గో షిప్ పై డ్రోన్ అటాక్ జరిగింది.  బుధవారం (మే 13) తెల్లవారు జామున డ్రోన్ అటాక్ తో భారత్ కు చెందిన హాజీ అలీ అనే సరుకు రవాణా నౌక హార్ముజ్ జలసంధిలో మునిగిపోయింది. సోమాలియా నుంచి షార్జాకు వస్తున్న ఈ నౌకపై ఒమన్ లోని  లిమా సమీపంలో డ్రోన్ దాడి జరగడంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. నిమిషాల్లో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఘటన  సమయంలో 14  మంది సిబ్బంది ఉన్నారు. అయితే లైఫ్ బోట్ల సాయంతో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకపై దాడి సరైనది కాదు అని పేర్కొంది. హార్ముజ్ లో నౌకాయానం భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. 

మునిగిపోయిన నౌక గుజరాత్ లోని దేవభూమి ద్వారకా జిల్లాకు చెందిన MSV హాజీ అలీ BDI 1492గా గుర్తించారు నేవీ అధికారులు. బుధవారం తెల్లవారు జామున  3.30గంటల ప్రాంతంలో ఈ నౌకహార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తుండగా దాడి జరిగింది..డ్రోన్ ఎటాక్ జరిగిన తర్వాత భారీ ఎత్తున మంటలు చెలరేగి కొద్ది నిమిషాల్లోనే నౌక సముద్రంలో మునిగిపోయిందని వెల్లడించారు. 

వారం రోజుల్లో హోర్ముజ్ జలసంధి సమీపంలో మునిగిపోయిన భారత నౌకలలో  ఇది రెండో నౌక.అంతకుముందు మే 8న ఇరాన్, అమెరికా మధ్య జరిగిన కాల్పుల్లో చిక్కుకుని గుజరాత్‌కు చెందిన  అల్ ఫైజ్ నూర్ సులేమానీ-1  అనే మరో నౌక మునిగిపోయింది. దాడి జరిగినప్పుడు ఆ నౌక దుబాయ్ నుంచి యెమెన్‌లోని ముకల్లాకు ప్రయాణిస్తోంది.ఈ వరుస సంఘటనలు భారతదేశ షిప్పింగ్ పరిశ్రమకు, ముఖ్యంగా గల్ఫ్ వాణిజ్య మార్గాల్లో పనిచేస్తున్న గుజరాత్ ఆధారిత కార్గో ఆపరేటర్లలో తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి.

దాడిని ఖండించిన భారత్ ..

ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించింది. ఈ దాడి  ఆమోదయోగ్యం కాదు అని అభివర్ణించింది మంత్రిత్వ శాఖ. సిబ్బందిని ఎన్నడూ ప్రమాదంలోకి నెట్టకూడదని స్పష్టం చేసింది. నౌక సిబ్బందిని రక్షించిన ఒమన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే కొనసాగుతున్న రీజినలన్ ఉద్రిక్తతల సమయంలో నౌకాయాన స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య మార్గాలను తప్పనిసరిగా రక్షించాలని కోరింది. రక్షించబడిన భారతీయ నౌకసిబ్బంది సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

►ALSO READ | చైనా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు.