- మూడో రోజు 4 నియోజకవర్గాల్లో పూర్తి
- మరో 4 సెగ్మెంట్లకు వచ్చే నెల 3 వరకు దరఖాస్తులకు గడువు
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇల్లు టవర్స్ లాటరీ ప్రక్రియ మూడవ రోజు ముగిసింది. ఆదివారం శేరిలింగంపల్లి, మేడ్చల్, మలక్పేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన లాటరీని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఇండ్లు చొప్పున నాలుగు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,920 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లాటరీలో ఇల్లు వచ్చిన అబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సొంత ఇంటి కలలు నిజం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల సమక్షంలో, హౌసింగ్ బోర్డ్ అధికారులతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియ సాగింది. ఆదివారం వరకు 12 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తికాగా, సోమవారం మరో నాలుగు నియోజకవర్గాల్లో లాటరీ నిర్వహించనున్నారు. సనత్నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం లాటరీ ప్రక్రియ జరుగుతుందని, దీంతో 16 నియోజకవర్గాల్లో లాటరీ ముగియనుందని హౌసింగ్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఈ 16 నియోజకవర్గాలు కాకుండా గోషామహల్, ఎల్బీనగర్, ముషీరాబాద్, చంద్రాయణగుట్ట నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలు సెప్టెంబర్ 3వ తేదీ వరకు మీసేవ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని హౌసింగ్ బోర్డ్ పేర్కొంది.
