న్యూఢిల్లీ: ‘భిన్నత్వంలో ఏకత్వం’అనేది భారత డీఎన్ఏలోనే ఉందంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఇండిపెండెంట్ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధ్వజమెత్తారు. చెప్పే మాటలకు విలువ ఉండదని, చేసే పనులే మాట్లాడాలని స్పష్టం చేశారు. స్వదేశంలో ఇలాంటి అంశాలపై మౌనం వహించే భాగవత్, విదేశాలకు వెళ్లి మాత్రం గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో వివమర్శించారు. న్యూయార్క్లో మోహన్ భాగవత్ ప్రసంగంపై పలువురు విపక్ష నేతలు ‘ఎక్స్’లో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ స్పందిస్తూ.. స్వదేశంలో ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను, హిందూ- ముస్లిం సామరస్యాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. భాగవత్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు.
