పెబ్బేరు, వెలుగు: విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానాలను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల ఎంపీపీఎస్ టీచర్ పి. మురళీకృష్ణ ఎంపికయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 5 నుంచి -12 వరకు జరగనున్న ఈ పర్యటనకు మొత్తం 29 మంది ఉపాధ్యాయులు, 11 మంది విద్యాశాఖ అధికారులు వెళ్తున్నారు. వనపర్తి జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఘనత పి. మురళీకృష్ణకు దక్కింది.
జపాన్లో క్రమశిక్షణ, సాంకేతిక విద్య, జీవన నైపుణ్యాలు, సైన్స్, రోబోటిక్స్ తదితర బోధనా పద్ధతులను వీరు పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పెబ్బేరుకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం మురళీకృష్ణను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్, సామాజిక వేత్త శ్రీధర్ రెడ్డి, రమేశ్ యాదవ్, వెంకటేశ్ యాదవ్, లక్ష్మయ్య యాదవ్, శ్రీనాథ్, వెంకటేశ్, గిరిజ గౌడ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
