చతుర్భుజ్ సింగ్ కిరాల్.. వయసు 14 ఏండ్ల 11 నెలలు. జ్యోతి ప్రియదర్శి.. 15 ఏండ్లు. యోగేంద్రనాథ్ సింగ్.. 16 ఏండ్లు. వీళ్లంతా ఏం చదువుతున్నారో తెలుసా? ఐఐటీలో ఇంజనీరింగ్. మామూలుగా ఈ వయసు పిల్లలు పదోతరగతి చదవాలి. కానీ.. వీళ్లు మాత్రం యమా స్పీడుగా చదివేస్తూ చిన్న వయసులోనే టెన్త్, ఇంటర్, ఐఐటీ ఎంట్రన్స్ దాటుకుని.. ఐఐటీలోకి అడుగుపెట్టేశారు! ఈ ఏడాది ఒక్క ఐఐటీ ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లోనే వీరితో సహా మొత్తం 9 మంది 16 ఏండ్లలోపు వారు సీట్లు కొట్టారు. ఐఐటీల్లో చేరే స్టూడెంట్ల సగటు వయసు 18 ఏండ్లు ఉంటుంది. యూపీలోని రాయిబరేలీకి చెందిన ఒక మామూలు స్కూలు టీచర్కూతురు అయిన జ్యోతి రెండేండ్లకే స్కూల్లో చేరిపోయి పలకా బలపం పట్టింది. ట్యూటర్లు, కోచింగ్సెంటర్ల వంటివి లేకుండానే చకచకా చదివేసింది. 13 ఏళ్లకే టెన్త్క్లాస్లో 89.5 శాతంతో పాస్ అయింది. ఈ ఏడాది ఇంటర్ (సీబీఎస్ఈ) 84.4% మార్కులు తెచ్చుకుంది. ఐఐటీ–జేఈఈలోనూ సత్తా చాటి ఐఐటీలో అడుగుపెట్టింది. చతుర్భుజ్ తండ్రి రాజస్థాన్లోని అల్వార్కు చెందిన తుక్కు సామాన్ల వ్యాపారి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
ఒకే స్కూలు నుంచి ముగ్గురు
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూలు ప్రయాస్బాయ్స్ విద్యాలయ స్టూడెంట్లూ చదువుల్లో మేటిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది ఈ ఒక్క స్కూలు నుంచే, యోగేంద్రనాథ్ సింగ్, వివేక్ కుమార్, అమర్నాథ్ పైక్రా అనే ముగ్గురు స్టూడెంట్లు ఐఐటీ ధన్బాద్లో సీటు సంపాదించారు. ఈ ముగ్గురూ 16 ఏండ్లలోపు వారే. దేశంలో ఇప్పటివరకూ ఐఐటీలో చేరిన అతిచిన్న వయసు స్టూడెంట్సత్యం కుమార్. బీహార్లోని భోజ్పూర్ జిల్లాకు చెందిన సత్యం 2012లో 12 ఏండ్ల వయసులోనే 679 ర్యాంకుతో ఐఐటీ సీటు కొట్టాడు. కాగా, ఐఐటీలో చేరేందుకు ఉండాల్సిన గరిష్ట వయసు వయసు పరిమితి25 ఏండ్లు. కానీ, కనీస వయసు గురించి నిబంధనల్లో ఎక్కడా లేదని జేఈఈ అడ్మిషన్కమిటీ చైర్మన్ ఆకే దాస్ వెల్లడించారు.