టెస్టు సిరీస్‌ నుంచి బుమ్రా ఔట్

టెస్టు సిరీస్‌ నుంచి బుమ్రా ఔట్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఫ్రంట్‌‌లైన్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా గాయం కారణంగా సిరీస్‌‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆటగాళ్లకు నిర్వహించే రొటిన్‌‌ చెకప్‌‌లో భాగంగా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని తేలడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే అతను ఎన్​సీఏలోని రిహాబిలేటషన్‌‌ సెంటర్‌‌కు వెళ్లనున్నాడని, బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోనున్నాడు. గాయం తీవ్రతను బట్టి తను మరో ఎనిమిది వారాలు జట్టుకు దూరమయ్యే అవకాశముందని  బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. ఈక్రమంలో నవంబర్‌‌ చివరి వరకు బంగ్లాదేశ్‌‌తో జరిగే సిరీస్‌‌లకు తను అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇటీవల వెస్టిండీస్‌‌ సిరీస్‌‌లో సత్తాచాటిన బుమ్రా.. అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన టెస్టు బౌలర్‌‌గా నిలిచాడు. అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌‌కు తనకు విశ్రాంతినిచ్చారు. బుమ్రా స్థానంలో సీనియర్‌‌ పేసర్‌‌ ఉమేశ్‌‌ యాదవ్‌‌ను జట్టులోకి తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌‌లో చివరి టెస్టు ఆడినా ఉమేశ్‌‌.. ఇటీవల వెస్టిండీస్‌‌లో పర్యటించిన ఇండియా–ఎ తరపున ఆడిన అంతగా ప్రభావం చూపలేకపోయాడు. విశాఖపట్నంలో వచ్చేనెల రెండు నుంచి ఇండియా–సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌‌ ప్రారంభంకానుంది.