మెహిదీపట్నం, వెలుగు: ఇంటర్ సెకండియర్ విద్యార్థిని గర్భం దాల్చి, బాత్రూంలో ప్రసవించింది. ఈ విషయం బయటపడుతుందనే టెన్షన్తో వెంటిలేటర్నుంచి పడేయడంతో శిశువు మృతి చెందిన ఘటన గోల్కొండ పీఎస్పరిధిలో జరిగింది. సీఐ సైదులు కథనం ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన బీసీ విద్యార్థిని గోల్కొండ మైనార్టీ స్కూల్లో చదివి, అనంతరం గోల్కొండ మైనార్టీ కాలేజీలో ఇంటర్లో చేరింది.
గతేడాది పరీక్షల అనంతరం ఇంటికి వెళ్లి వారం రోజుల కింద సెకండ్ ఇయర్లో జాయిన్ అయింది. అప్పటికే గర్భం దాల్చిన యువతి ఎవరికి అనుమానం రాకుండా వదులుగా ఉన్న డ్రెస్సులు వేసుకునేది. 9 నెలల గర్భవతి అయిన బాలిక మంగళవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి ప్రసవించింది.
వెంటనే నవజాతి శిశువును వెంటిలేటర్ లో నుంచి పడేయడంతో శిశువు మృతి చెందింది. ప్రసవం విషయం బయటకు పొక్కడంతో మంగళవారం పోలీసులు శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సదరు యువతి తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
