మగవారితో పోలిస్తే వీరి పోర్టుఫోలియో సైజ్ 20% తక్కువ
జీతాల్లో గ్యాప్ ఉందనే విషయం తెలుస్తోంది
మహిళా ఇన్వెస్టర్లలో 30 % మంది ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచే
పెరుగుతున్న ఫైనాన్షియల్ లిటరసీ : కువెరా
న్యూఢిల్లీ : మహిళా ఇన్వెస్టర్లు కిందటేడాదితో పోలిస్తే కొద్దిగా పెరిగారని ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్లను అందించే కువెరా పేర్కొంది. తమ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న 16 లక్షల మంది ఇన్వెస్టర్లలో 26 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది. కిందటేడాది మార్చి నాటికి ఈ నెంబర్ 19 శాతంగా ఉంది. ఇండస్ట్రీ తీసుకుంటున్న వివిధ ఫైనాన్షియల్ లిటరసీ చర్యలు ఫలితాలిస్తున్నాయని కువెరా అభిప్రాయపడింది. కిందటేడాదితో పోలిస్తే కొద్దిగానే మెరుగుపడినప్పటికీ, ఫైనాన్షియల్ ప్లానింగ్పై మహిళల్లో అవగాహన పెరుగుతోందని కువెరా సీఈఓ గౌరవ్ రాస్టోగి పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉందని అన్నారు. కువెరా తమ ఇన్వెస్టర్ల డేటాను విశ్లేషించి, మహిళా ఇన్వెస్టర్ల ఇన్వెస్టింగ్ అలవాట్లను తెలుసుకుంది. రిటైర్మెంట్, ఇల్లు, పిల్లల చదువు.. వంటి వాటి కోసం మహిళలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారని కువెరా వెల్లడించింది.
టైర్ 1, 2 సిటీల నుంచి కూడా..
దేశంలోని మొత్తం మహిళా ఇన్వెస్టర్లలో 30 శాతం మంది నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఢిల్లీ), బెంగళూరు, ముంబై నుంచే ఉన్నారని కువెరా పేర్కొంది. ఈ మెట్రో సిటీలలోని మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీ ఎక్కువగా ఉందని తెలుస్తోందని తెలిపింది. అయినప్పటికీ, దేశంలోని ప్రతీ 10 మంది మహిళా ఇన్వెస్టర్లలో 6 మంది టైర్ 1, 2 సిటీల నుంచే ఉన్నారని వివరించింది. దీనిని బట్టి చిన్న సిటీలలోని మహిళలు కూడా ఫైనాన్షియల్ లిటరసీ కలిగి ఉన్నారని అభిప్రాయపడింది. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది మహిళా ఇన్వెస్టర్ల సగటు వయసు కొద్దిగా తగ్గిందని కువెరా వెల్లడించింది. వీరి యావరేజ్ వయసు 34 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు తగ్గింది. యంగర్ వుమెన్ తమ ఫైనాన్షియల్ నిర్ణయాలను తామే తీసుకుంటున్నారని కువెరా అంచనావేసింది. మగవారితో పోలిస్తే మహిళలు తమ లైఫ్లో లేటుగా ఇన్వెస్టింగ్లోకి ఎంటర్ అవుతున్నారని అభిప్రాయపడింది.
శాలరీల్లో గ్యాప్..
మగవారితో పోలిస్తే మహిళల పోర్టుఫోలియో సైజ్ తక్కువగా ఉందని కువెరా పేర్కొంది. ఒకే ఏజ్ ఉన్న మగవారితో పోలిస్తే మహిళల సగటు పోర్టుఫోలియో సైజ్ 20 శాతం తక్కువగా ఉందని, దీనిని బట్టి జీతాల్లో గ్యాప్ ఉందనే విషయం తెలుస్తోందని అంచనావేసింది. తమ ఫైనాన్షియల్స్ను తాము కంట్రోల్ చేసుకుంటున్నామనే ఫీలింగ్కు చేరుకోవడానికి మగవారితో పోలిస్తే మహిళలకు ఎక్కువ టైమ్ పడుతోందని కంపెనీ సీఈఓ గౌరవ్ రాస్టోగి పేర్కొన్నారు. ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి వీలుండే ఫండ్స్ వైపు మహిళా ఇన్వెస్టర్లు ఎక్కువగా చూస్తున్నారని, ఇటువంటి టైప్ ఫండ్స్లలో వీరు డబ్బులు పెట్టడం గత కొంత కాలం నుంచి పెరుగుతోందని అన్నారు. 2019–20 లో 23 శాతం మంది మహిళా ఇన్వెస్టర్లు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారని, ప్రస్తుతం ఈ నెంబర్ 29 శాతానికి పెరిగిందని వెల్లడించారు. కాగా, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ను ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని కూడా అంటారు. ఈ ఫండ్స్ షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ ద్వారా సంపాదించిన ఇన్కమ్పై ట్యాక్స్ మినహాయింపు పొందడానికి వీలుంటోంది. ఈ ఫండ్స్లలోకి వస్తున్న మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో 32 శాతం అమౌంట్ 29 శాతం మంది మహిళా ఇన్వెస్టర్ల నుంచి వస్తోందని కువెరా వివరించింది.