2.76 లక్షల ఐపీ అడ్రస్ల నుంచి ఎటాక్స్
30% దాడులు చైనాపైనే
సైబర్ ఎటాక్లపై కాస్పర్స్కై రిపోర్ట్
‘ఐవోటీ: ఏ మాల్ వేర్ స్టోరీ’ పేరుతో నివేదిక
వర్చువల్ అసిస్టెంట్.. చిన్న డబ్బాలానే ఉంటది. కానీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి మనకు ఎన్నో పనులు చేసి పెడ్తది. పాటలు వినిపిస్తది. వార్తలు చదువుతది. అలారం సెట్ చేస్తది. ఏ టైంకు ఏ పని చేయాల్నో గుర్తు చేస్తది. ఇంకా ఎన్నో పనులను చేసి పెడ్తది. అలాగే స్మార్ట్ టీవీ.. బోలెడు చానెళ్లు చూసుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవచ్చు. కంప్యూటర్గానూ వాడుకోవచ్చు. స్మార్ట్ డోర్ లాక్, స్మార్ట్ ఫ్రిజ్, స్మార్ట్ ఏసీలు, స్మార్ట్ హీటింగ్ సిస్టంల వంటివన్నీ ఇప్పుడు మన ఇండ్లను స్మార్ట్ హోమ్స్గా మార్చేస్తున్నాయి.
ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండి పనిచేసే పరికరాలనే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంటున్నం. అయితే, ఇలాంటి ఐవోటీ డివైస్లను సైబర్ క్రిమినల్స్ చాలా ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐవోటీలపై ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా10 కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయట. ఐవోటీ డివైస్లను సైబర్ నేరగాళ్లు ఎలా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు? సమస్య ఎంత తీవ్రంగా ఉంది? అన్నవి తెలుసుకునేందుకు తాము హనీపాట్స్ నెట్ వర్క్స్ ఎరగా వేయగా ఐపీ అడ్రస్ లతో సహా హ్యాకర్ల సీక్రెట్స్ తెలిశాయని మల్టీనేషనల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘కాస్పర్ స్కై’ వెల్లడించింది. దీనిపై ‘ఐవోటీ: ఏ మాల్ వేర్ స్టోరీ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.
2018 కంటే 9 రెట్లు ఎక్కువ
వివిధ దేశాల్లోని ఐవోటీ డివైస్లపై ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మొత్తం10.50 కోట్ల సైబర్ దాడులు జరిగాయని కాస్పర్ స్కై వెల్లడించింది. 2.76 లక్షల ఐపీ అడ్రస్ల నుంచి హ్యాకర్లు ఈ దాడులు చేశారని తెలిపింది. అయితే గత ఏడాది మొదటి ఆరునెలల్లో 69 వేల ఐపీ అడ్రస్ల నుంచి 1.2 కోట్ల దాడులు మాత్రమే జరిగాయని, ఈ ఏడాది సైబర్ దాడులు ఏకంగా 9 రెట్లు ఎక్కువయ్యాయని పేర్కొంది. ఐవోటీ డివైస్లను హ్యాక్ చేయడం ద్వారా మాల్ వేర్ను వ్యాప్తి చేయడం, ఆ డివైస్లను కంట్రోల్లోకి తీసుకుని డబ్బు డిమాండ్ చేయడం, ఇతర రకాలుగా డబ్బు సంపాదించేందుకు వాడుకోవడం వంటివి చేశారని తెలిపింది. మాల్ వేర్స్ వ్యాప్తి చేసిన తర్వాత ఆ డివైస్లను కంట్రోల్లోకి తీసుకుని, డీడీఓఎస్ తరహా ఎటాక్స్ చేయడం లేదా వాటిని తమ హ్యాకింగ్ యాక్టివిటీస్ కోసం ప్రాక్సీలుగా వాడుకోవడం కూడా చేస్తున్నారని తెలిపింది.
ఈ మూడు మాల్ వేర్లతోనే..
సైబర్ క్రిమినల్స్ ఈ ఏడాది మిరాయ్, న్యాడ్రాప్, గాఫ్జిట్ అనే మూడు రకాల మాల్ వేర్లనే ఎక్కువగా ఉపయోగించారట. ఈ ఏడాది 39 % సైబర్ దాడులకు మిరాయ్ను వాడారట. ఈ మాల్ వేర్ ఐవోటీ డివైస్లలోని లోపాలను ఆసరాగా చేసుకుని, వాటిలోకి చేరి కంట్రోల్లోకి తీసుకుంటున్నాయని కాస్పర్ స్కై తెలిపింది. అలాగే పాస్ వర్డ్లను తెలుసుకునేందుకు బ్రూట్ ఫోర్సింగ్ వంటి పద్ధతులు వాడుతున్నారని పేర్కొంది. న్యాడ్రాప్ను 38.75% దాడులకు వాడారట. ఇది మిరాయ్ డౌన్లోడర్గా పనిచేస్తుందట. వీటి తర్వాత గాఫ్జిట్ మాల్ వేర్ను 2.12% దాడులకు ఉపయోగించారని తేలింది.
ఎక్కువ సైబర్ దాడులు చైనాపైనే..
సైబర్ దాడులు ఏయే దేశాల్లో ఎన్ని జరిగాయన్న వివరాలను కూడా కాస్పర్ స్కై పరిశీలించింది. దీంతో ఈ ఏడాది చైనాలో అత్యధికంగా 30 శాతం సైబర్ దాడులు జరిగాయని తేలింది. ఆ తర్వాత బ్రెజిల్లో 19 శాతం, ఈజిప్ట్లో 12 శాతం దాడులు జరిగాయని వెల్లడైంది. గత ఏడాది బ్రెజిల్లో 28 శాతం, చైనాలో 14 శాతం, జపాన్లో 11 శాతం సైబర్ ఎటాక్స్ జరిగాయని తేలింది.
ఐవోటీ డివైస్లను ఇలా రక్షించుకోవచ్చు..
ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్డేట్లను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే అప్డేట్లతో వాటిని నివారించే అవకాశం ఉంటుంది.
పాస్వర్డ్లను తరచూ మార్చాలి. క్యాపిటల్, లోయర్ కేస్ అక్షరాలు, నెంబర్లు, సింబల్స్ కలిపి కష్టమైన పాస్వర్డ్లను సెట్ చేసుకోవాలి.
పరికరాల్లో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రీబూట్ చేయాలి. దీనివల్ల ఇదివరకే వచ్చిన మాల్వేర్ నుంచి రక్షణ ఉంటుంది.
ఐవోటీ పరికరాలను లోకల్ వీపీఎన్, హోమ్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలి. వైర్ గార్డ్ లు, ఓపెన్ సోర్స్ వీపీఎన్ సొల్యూషన్ వంటివీ ఉపయోగపడతాయి.
