యూఏఈ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ సరికొత్తగా కనిపిస్తోందని ఆ జట్టు కీలక ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఇంతకుముందు ఉన్న ఆర్సీబీ టీమ్స్ కంటే ప్రస్తుత జట్టు నూతనోత్తేజంతో ఫ్రెష్గా ఉందన్నాడు. బెంగళూరు టీమ్లో ఆరోన్ ఫించ్, డేల్ స్టెయిన్, ఇసురు ఉడాన, క్రిస్ మోరిస్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ కొత్తగా చేరారు. దీంతో జట్టు బలం మరింతగా పెరిగింది. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ టీమ్ గురించి డివిలియర్స్ పలు విషయాలు పంచుకున్నాడు. టోర్నీలో ముందుకెళ్లడానికి సరైన కాంబినేషన్స్ను టీమ్ మేనేజ్మెంట్ ఎంచుకుంటుందని విధ్వంసక ప్లేయర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
‘ప్రతి యేడు టీమ్ బాగుందని చెప్పడం పరిపాటే. కానీ నిజంగా ఈ సంవత్సరం తయారైన టీమ్ బాగుంది. ఇది మా జట్టు. ఈ ఏడాది డిఫరెంట్గా ఉండబోతోందని మీకు ప్రామిస్ చేస్తున్నా. బెస్ట్ టీమ్ అని చెప్పలేను. కానీ టీమ్లో తాజాదనం ఉంది. ఇది చాలా ఎక్సయిటింగ్. కాంబినేషన్స్ మీద దృష్టి పెట్టాం. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. టోర్నమెంట్కు కావాల్సిన బెస్ట్ టీమ్ను కోచ్లతో కలసి కెప్టెన్ కోహ్లీ నిర్ణయిస్తాడు. ప్రతి మ్యాచ్లో నేను లేదా పార్థివ్, స్టెయిన్ ఆడాలని కాదు. ప్రతి ఒక్క విభాగంలో ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ చాయిస్లు ఉన్నాయి. ఇది మంచి విషయం. నిజాయితీగా చెప్పాలంటే.. మేం అందరం చాలా ఇష్టపడిన 2016 సీజన్ తర్వాత ప్రస్తుత టీమ్ చాలా సమతూకంతో ఉందని చెప్పొచ్చు. కోహ్లీ అందరికీ స్టాండర్డ్స్ సెట్ చేస్తాడు. అందుకు అతడికి క్రెడిట్ ఇవ్వాలి. విరాట్లా ముందుండి నడిపేవారు ఉన్నప్పుడు ఆట సులువు అవుతుంది’ అని ఏబీ పేర్కొన్నాడు.
