
కుర్దులు ఐసీస్ పనిపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్డీఎఫ్ పేరిట పోరాటం చేస్తున్నారు. దీనికి ఇన్నాళ్లూ అమెరికా మద్దతిస్తూ వచ్చింది. కానీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఐఎస్పై తమ యుద్ధం ఇక ముగిసిందంటూ ఇటీవల సడెన్గా ప్రకటించడం కుర్దులకు పెద్ద కుదుపులా మారింది. తమ సైన్యం సిరియా నుంచి వెనక్కి వచ్చేస్తుందని కూడా ట్రంప్ తేల్చిచెప్పటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సందు కోసమే ఎదురుచూసిన టర్కీ.. సిరియాపై వెంటనే పంజా విసిరింది.
దీంతో ట్రంప్ను నమ్మి కుర్దులు మోసపోయారనే భావన నెలకొంది. సిరియాపై టర్కీ జరిపిన దాడులను అమెరికా సున్నితంగా విమర్శించిందే గానీ గట్టిగా ఖండించ లేదు. ఒకప్పుడు తనకు అండగా నిలిచిన కుర్దులను అవసరం తీరాక వదిలేశారు. లేటెస్ట్ ఎటాక్లో కుర్దులు చనిపోతే ‘అయ్యో’ అని కనీసం జాలిపడలేదు. టర్కీ దాడులను ఇండియాతోపాటు చాలా దేశాలు తప్పుపట్టాయి. దీనిపై భద్రతా మండలిలో చర్చించాలని కోరాయి.