రైతులకు భరోసా ఇచ్చేది మోదీనే :  సోమన్న

రైతులకు భరోసా ఇచ్చేది మోదీనే :  సోమన్న

జమ్మికుంట, వెలుగు :  దేశానికి అన్నం పెట్టే రైతులకు భరోసా ఇచ్చేది మోదీ ప్రభుత్వమేనని కేంద్ర జల వనరులు, రైల్వే సహాయ మంత్రి సోమన్న పేర్కొన్నారు. పీఎం కిసాన్  సమ్మాన్  నిధి విడుదల చేసిన సందర్భంగా  కరీంనగర్​ జిల్లా జమ్మికుంట కేవీకేలో జరిగిన కార్యక్రమానికి ఆయన చీఫ్  గెస్ట్​గా హాజరయ్యారు. రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు.

కృషి సఖి శిక్షణ పొందిన 30 వేల మంది పారా ఎక్స్ టెన్షన్  వర్కర్లకు సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కిసాన్  సమ్మాన్  నిధి కింద రాష్ట్రంలో  29.50 లక్షల మంది రైతులకు రూ.590 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్  జిల్లాలో 95,515 మంది రైతులకు రూ.18.10 కోట్లు అందుతున్నాయన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అటారి డైరెక్టర్ షేక్  మీరా, కేవీకే సెక్రటరీ విజయ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ లీడర్లు

కిసాన్  సమ్మాన్​ నిధి విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా గురించి ప్రస్తావించగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి జరిగిందని పేర్కొనగా, అధికార  కార్యక్రమంలో బీఆర్ఎస్​ గురించి మాట్లాడడం సరైంది కాదంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఎమ్మెల్యే, బీజేపీ  నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి సోమన్న బీజేపీ నేతలను శాంతింపచేయడంతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది.