వాచీ తెచ్చి జైలు పాలైన యువకుడు
ఓ వ్యక్తి.. బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానం దిగిండు. చకచకా నడుచుకుంటూ పోతుండు. ఇంతలోనే ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు అతడిని ఆపిన్రు. బ్యాగులు చెక్ చేసిన్రు. ఓ వాచీ దొరికింది. వెంటనే తీసుకెళ్లి జైల్లో వేసిన్రు!!!
…వాచీ దొరికితే జైల్లో వేస్తారా..? అంత నేరమా..? అని అనుకుంటున్నారు కదా. అది మామూలు వాచీ కాదు మరి. ₹2.7 కోట్ల విలువైన వాచీ. బంధువులకు గిఫ్ట్ పేరిట దానిని దొడ్డి దారిన తెచ్చి ట్యాక్స్ ఎగ్గొట్టినందుకు అతడు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన బుధవారం ముంబై విమానాశ్రయంలో జరిగింది. కవిన్కుమార్ మెహతా (24) అనే యువకుడు, అత్యంత ఖరీదైన ఆస్ట్రానమియా సోలార్ జోడియాక్ వాచీని అతడు అడ్డదారిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అమెరికా లగ్జరీ వాచీల బ్రాండ్ జాకబ్ అండ్ కో ఆ వాచీలను తయారు చేస్తోంది. ఆ వాచీని స్వాధీనం చేసుకున్న అధికారులు ముందు ₹1.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
అతడిని అదుపులోకి తీసుకుని వాచీ వివరాలు తెలుసుకునేందుకు రోజ్ ద వాచ్ బార్ అనే డీలర్ దగ్గరకు పంపించారు. జీఎస్టీ , డాలర్ రేటుతో కలుపుకుని ఆ వాచీ ధర ₹2.7 కోట్లకు తేలింది. ఇలాంటి వాచీలపై 38 శాతం కస్టమ్ సుంకం చెల్లించాల్సి ఉంటుందని, కానీ, దాన్ని ఎగ్గొట్టేందుకు కవిన్ కుమార్ బంధువుల పేరు చెప్పి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడని అధికారులు అంటున్నారు. దేశంలోని ఇలాంటి ఖరీదైన వాచీలను అడ్డదారుల్లో తేవడానికి ప్రయత్నిస్తే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు ఇలాంటి వాచీలనే తెస్తున్నా, పాత వాటిని తెచ్చి కొత్తగా మార్చి ధనవంతులకు అమ్మేస్తున్నారని చెబుతున్నారు. హాంకాంగ్, మకావు, దుబాయ్, బ్యాంకాక్లలో వెస్టర్న్ టూరిస్టులు కాసినోల్లో డబ్బులు పోగొట్టుకుని, డబ్బుకు బదులు ఇలాంటి వాచీలను అక్కడ పెట్టేసి వస్తున్నారని, వాటినే కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారని అంటున్నారు.