మా నీటిని మేం వాడుకుంటాం..రాజకీయం వద్దు

మా నీటిని మేం వాడుకుంటాం..రాజకీయం వద్దు

అమరావతి, వెలుగు: కృష్ణా నదిలో తమకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరాలపై ఆయన స్పందించారు. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లులేని దుస్థితి ఉందని, మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. మంగళవారం అమరావతిలోని తన నివాసంలో ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం లేద‌‌న్నారు. పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి కృష్ణా బోర్డు కూడా అంగీకరించద‌‌ని చెప్పారు.

ఏడాదిలో 10 రోజుల్లోనే..

రాష్ట్రానికి కేటాయించిన నీటిని తీసుకోవడానికి పోతిరెడ్డిపాడు వద్ద ప్రాజెక్టు కట్టుకుంటున్నామని సీఎం జగన్ అన్నారు. ‘శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి చాన్స్ ఉంది. ఈ స్థాయిలో నీటిమట్టం ఏడాదిలో సగటున 10 రోజులకు మించి ఉండదు. ఆ 10 రోజుల్లోనే నీటిని తీసుకెళ్లాలి. శ్రీశైలంలో వాటర్ లెవెల్ 854 అడుగులకు చేరితే 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం. ఇక 841 అడుగులకు చేరితే వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వెళ్తుంది. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌‌ నుంచి వెళ్లేది గరిష్టంగా 9 వేల క్యూసెక్కులు మాత్రమే. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే సాధ్యం’ అని జగన్ అన్నారు.

తెలంగాణకు 200  టీఎంసీలు
తీసుకునే కెపాసిటీ ఉంది

తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా  శ్రీశైలంలో 800 అడుగులు ఉన్నప్పుడు రోజుకు 2 టీఎంసీల మేర 90 టీఎంసీలు తరలించవచ్చని చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారన్నారు. 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి 30 టీఎంసీలు, ఎస్‌‌ఎల్‌‌బీసీ ద్వారా అయితే శ్రీశైలంలో 824 అడుగులు నీటిమట్టం ఉన్నప్పుడు కూడా 40 టీఎంసీలు తరలించవచ్చన్నారు. ఇలా శ్రీశైలం నుంచి సుమారు 200 టీఎంసీల నీటిని తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉందని జ‌‌గ‌‌న్ అన్నారు. శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల, భీమ, నెట్టెంపాడు, కోయల్‌‌సాగర్‌‌ల నుంచి నుంచి తెలంగాణ నీళ్లు తీసుకోగలుగుతుందని చెప్పారు.

పోతిరెడ్డిపాడును అడ్డుకోండి..కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు