- రంజీ మ్యాచ్కు జస్ప్రీత్ దూరం
- శ్రీలంకతో టీ20తోనే రీ ఎంట్రీ!
ముంబై: ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ బాసటగా నిలిచాడు. దాదా సూచన మేరకు రంజీ మ్యాచ్కు అతడిని దూరంగా ఉంచారు. గాయం కారణంగా మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ను రంజీ ఆడించి ఫిట్నెస్ పరీక్షించాలని సెలెక్షన్ కమిటీ భావించింది. దాంతో, సూరత్లో కేరళతో బుధవారం మొదలైన గ్రూప్-–ఎ మ్యాచ్లో గుజరాత్ తరఫున బుమ్రా బరిలోకి దిగడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, రంజీ ఆడేందుకు ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ.. తన రీఎంట్రీ ప్రాసెస్ కఠినంగా ఉండకూదని బుమ్రా భావించాడు. వచ్చే సీజన్ను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా కాంపిటీటివ్ క్రికెట్లోకి మళ్లీ అడుగుపెట్టాలని కోరుకుంటున్నాడు. ఇదే విషయాన్ని అతను బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రెటరీ జై షా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన దాదా, షా ప్రస్తుతానికి వైట్బాల్ క్రికెట్పైనే దృష్టి పెట్టాలని బుమ్రాకు సూచించినట్టు సమాచారం. అలాగే, టీ20 సిరీస్ ముంగిట బుమ్రా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో రోజంతా బౌలింగ్ చేయడంపై ఇండియా టీమ్ మేనేజ్మెంట్ కూడా విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న దాదా.. బుమ్రా రంజీ ఆడాల్సిన అవసరం లేదని నిర్ణయించాడు.
ప్రొటోకాల్ పక్కనబెట్టి మరీ బ్రేక్ కొనసాగించేందుకు స్టార్ పేసర్ను అనుమతించాడు. దాంతో వచ్చే నెల 5వ తేదీన శ్రీలంకతో మొదలయ్యే టీ20 సిరీస్తోనే బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా, గాయం నుంచి కోలుకొని వచ్చిన నేపథ్యంలో రంజీ మ్యాచ్లో బుమ్రాతో రోజుకు నాలుగు నుంచి ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించాలని నేషనల్ సెలెక్షన్ ప్యానెల్ గుజరాత్ టీమ్ మేనేజ్మెంట్కు చెప్పిందని తెలుస్తోంది. దీనిపై గుజరాత్ అసంతృప్తి వ్యక్తం చేసిందట. ‘న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు చాలా టైముంది. అప్పటిదాకా బుమ్రా రెడ్ బాల్ క్రికెట్ ఆడడు కాబట్టి తొందరేం లేదు. అతనిప్పుడు టీ20 మ్యాచ్లో నాలుగు ఓవర్లతో బౌలింగ్తో మొదలు పెట్టొచ్చు. కావాలంటే కివీస్ టూర్కు వెళ్లే ముందు రంజీ మ్యాచ్ ఆడిస్తే సరిపోతుంది’అని టీమ్ వర్గాలు అంటున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్కు కూడా బుమ్రా రంజీ మ్యాచ్ ఆడడం ఇష్టం లేకపోవడం.. గంగూలీ రంగంలోకి దిగడంతో వివాదానికి పుల్స్టాప్ పడింది.


