జవహర్నగర్, వెలుగు: సెల్ఫోన్ తీసుకుని తిరిగివ్వలేదని తోటి కార్మికుడిని హత్య చేసిన వ్యక్తిని జవహర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన జితేందర్ చౌదరి 15 ఏండ్ల కిందట సిటీకి వచ్చి కీసర మండలం దమ్మాయిగూడలో ఉంటున్నాడు. జితేందర్ బిల్డింగ్ పెయింటింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఓ బిల్డింగ్కు పెయింటింగ్ వేసేందుకు కూలీల కోసం యూపీకి చెందిన రవి జెనార్, బాబును జితేందర్ సిటీకి తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు కూలీలకు దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఓ రూమ్లో వసతి ఏర్పాటు చేశాడు. అదే రూమ్లో మరో కార్మికుడు సచిన్ కూడా ఉంటున్నాడు.
ఈ నెల 7న రాత్రి రవి జెనార్, బాబు, సచిన్ ముగ్గురు కలిసి మద్యం తాగారు. అయితే, సచిన్ ఫోన్ను రవి జెనార్ తీసుకున్నాడు. తన మొబైల్ను ఇవ్వాలని సచిన్ అడగగా.. రవి వినిపించుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంలో సచిన్కత్తితో రవి జెనార్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సచిన్ను అదుపులోకి తీసుకున్నారు. రవి డెడ్బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.