జెట్ ఎయిర్ వేస్ పైలెట్ల హెచ్చరిక
న్యూఢిల్లీ: జీతాలు చెల్లించకపోతే సోమవారం నుంచి సమ్మె చేస్తామని, న్యాయపరమైన పోరాటమూ మొదలు పెడతామని జెట్ ఎయిర్ వేస్ పైలెట్లు హెచ్చరించారు. ఈ మేరకు కంపెనీ సీఈఓ వినయ్ దూబేకు శనివారం ఉత్తరం రాశారు. గత ఎనిమిది నెలల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడంలేదని, సంస్థ యాజమాన్యంపై నమ్మకం కోల్పోవడం వల్లే సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ ఒకటిన జీతాలు రాకుంటే విమానాలు నడపబోమని స్పష్టీకరించారు. జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు నరేశ్గోయల్ చైర్మన్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్ వేస్ నామినీ కెవిన్ నైట్ బోర్డు నుంచి ఇటీవల వైదొలిగారు. దీంతో కంపెనీ లెండర్ల చేతుల్లోకి వెళ్లింది. వీళ్లు జెట్ ఆస్తులను తనఖా పెట్టుకొని తక్షణం డెట్ ఇన్స్ట్రమెంట్ల రూపంలో రూ.1,500కోట్లు ఇస్తారు. లెండర్లు తమ తరఫు నుంచి ఇద్దరు డైరెక్టర్లను బోర్డులోకి నామినేట్ చేశారు. షేర్లను కొత్తఇన్వెస్టర్లకు అమ్మడానికి లెండర్లు త్వరలోనే బిడ్డింగ్ను మొదలుపెడుతారు.