
హైదరాబాద్, వెలుగు: ‘నీట్’ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తామని, ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాని మోదీ పాలనలో నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు, లీకేజీలు సర్వసాధారణంగా మారాయని మండిపడ్డారు. కేంద్రం తీరుతో విద్యార్థుల జీవితాలు గందరగోళంగా మారాయన్నారు. బిహార్, గుజరాత్లలో ప్రశ్నపత్రాలు లీక్ చేశారని, పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్షలు రాసిన విద్యార్థుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది నీట్ పరీక్ష రాశారని చెప్పారు. లీకేజీలపై న్యాయ విచారణకు కేంద్రం ఆదేశించాలని, విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.