- 11 ఏళ్ల నుంచి భర్తీ కాని జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టులు
- రెగ్యులర్లో 917 మందే.. కాంట్రాక్టులో 3,964 మంది
- 2008 నుంచి నిలిచిన రిక్రూట్మెంట్
- కాంట్రాక్టు లెక్చరర్ల పర్మనెంట్ లొల్లి వల్లేనంటున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: సర్కారీ ఇంటర్ కాలేజీలు లెక్చరర్లు లేక బోసిపోతున్నయ్. ఇటు టీచింగ్, అటు నాన్ టీచింగ్ పోస్టులు మస్తుగ ఖాళీ ఉన్నయ్. పోస్టులను బాగానే మంజూరు చేసినా.. దాదాపు పదకొండేళ్లుగా భర్తీ మాటే లేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం లెక్చరర్లను తీసుకున్నా వాళ్లను పూర్తిగా రిక్రూట్ చేయకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు.
పర్మనెంట్ లెక్చరర్లు 917 మందే
రాష్ర్టంలోని 404 సర్కారీ కాలేజీల్లో సుమారు 1.80 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీటిల్లో మొత్తం 6,008 లెక్చరర్ పోస్టులను మంజూరు చేయగా ప్రస్తుతం 5,091 ఖాళీగా ఉన్నాయి. 917 మందే పర్మనెంట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. జనరల్ కోర్సుల్లో 5,395 లెక్చరర్ పోస్టులకు 889 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 613 మందికి 28 మందే రెగ్యులర్ లెక్చరర్లున్నారు. ఖాళీ పోస్టుల్లో దాదాపు సగం మందినే కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం 3,964 మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మినిమమ్ టైమ్ స్కేల్ పేరుతో లెక్చరర్లుగా పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2008లో చివరిసారి 1,100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకూ పోస్టుల భర్తీనే లేదు. కాంట్రాక్టు లెక్చరర్ల పర్మనెంట్ లొల్లి వల్లే భర్తీ ఆగిందని అధికారులు అంటున్నారు. దీంతో పీజీ చేసిన వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది.
నాన్ టీచింగ్లోనూ సగం ఖాళీలు
ఇంటర్ కమిషనరేట్ పరిధిలో నాన్ టీచింగ్ విభాగంలో అటెండర్ పోస్టు నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకూ భారీగానే ఖాళీలున్నాయి. 2,098 మంజూరైతే 1,279 మందే పని చేస్తున్నారు. 819 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 417 మంజూరైతే 213 ఖాళీగా, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 335 మంజూరైతే 187 ఖాళీగా ఉన్నాయి. రికార్డు అసిస్టెంట్ 92, టైపిస్ట్లు 95, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 228 ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి మరో వెయ్యి పోస్టుల వరకు అవసరమున్నా సర్కారు మంజూరు చేయలేదు. ఇక స్టేట్ మొత్తం 16 మాత్రమే సీనియర్ అసిస్టెంట్ పోస్టులుంటే వీటిల్లోనూ 4 ఖాళీలే. సర్కారు అవసరమైనన్ని మంజూరు చేయకుండా చాలా వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నింపుతూ పోతోంది.
‘ఉర్దూ’లోనూ మస్తుగనే..
రాష్ట్రంలో 51 ఉర్దూ మీడియం కాలేజీలున్నాయి. వీటిలో 317 జూనియర్ లెక్చరర్ పోస్టులు మంజూరవగా 79 మందే రెగ్యులర్ లెక్చరర్లున్నారు. మిగిలిన 238 పోస్టుల్లోకి 204 మంది కాంట్రాక్టు లెక్చరర్లను తీసుకొని 34 పోస్టులు ఖాళీగా ఉంచారు. దీంతో స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు.
స్టేట్లో పీడీలు 21 మందే
రాష్ట్రంలోని 404 కాలేజీలకు గాను 324 కాలేజీల్లోనే పీడీ(ఫిజికల్ డైరెక్టర్), లైబ్రేరియన్ పోస్టులను మంజూరు చేశారు. వీటిల్లోనూ ఖాళీల కొరత వేధిస్తోంది. 21 మంది పీడీలు, 147 మంది లైబ్రేరియన్స్ మాత్రమే పని చేస్తున్నారు. 303 పీడీ పోస్టులు, 177 లైబ్రరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో స్టూడెంట్స్కు ఆటలాడించే వాళ్లు కరువయ్యారు. లైబ్రేరియన్స్ లేక వాటి నిర్వహణ మరిచిపోయారు.
రెగ్యులర్ వాళ్లుంటేనే ప్రమాణాలు
రెగ్యులర్ లెక్చరర్లు ఉంటేనే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెరుగుపడ్తాయి. ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వాళ్లకు జాబ్ సెక్యూరిటీ లేదు. దీని ప్రభావం ప్రమాణాలపై పడుతుంది. 2008లో చివరిసారి జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఇప్పటివరకూ ఇవ్వలేదు. కాంట్రాక్టు వాళ్లను రెగ్యులరైనా చేయండి. కొత్త నోటిఫికేషన్ వేయండి.- మధుసూదన్రెడ్డి, ఇంటర్ జేఏసీ చైర్మన్