
బషీర్ బాగ్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో దగాపడ్డ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మంగళవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. మంత్రి జూపల్లితోపాటు 33 జిల్లాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అన్ని వర్గాలను ముఖ్యంగా అమరవీరులను, కళాకారులను దగా చేసిందన్నారు.
తాను రాజకీయ గురువుగా భావించే ప్రొఫెసర్ జయశంకర్ ను కూడా మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. సాంస్కృతిక సారథి కళాకారుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. బంగారు పళ్లెంలో రాష్ట్రాన్ని అప్పజెప్పామని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు.. రూ.8లక్షల కోట్ల అప్పుపై స్పందించాలన్నారు. కళాకారుల సమస్యలపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.