- రాజ్ భవన్ డెడ్ లైన్లను లెక్కచేయని స్పీకర్
- గవర్నర్ జోక్యం పై సుప్రీంను ఆశ్రయించిన సీఎం కుమారస్వామి
- విప్ అధికారాలపై క్లారిటీ కావాలంటూ విడిగా కాంగ్రెస్
- పిటిషన్ రెండోరోజూ ఓటింగ్ చేపట్టకపోవడంపై బీజేపీ నిరసన
కర్నాటకలో పొలిటికల్ గేమ్ మరో మలుపుతిరిగింది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయి వాలా విధించిన డెడ్లైన్లను ధిక్కరిస్తూ.. స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని సోమవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ మితిమీరి జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డ సీఎం కుమారస్వామి.. దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేలకు విప్ నిబంధనలు వర్తిస్తాయో లేదో కోర్టే తేల్చాలంటూ కర్నాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు విడిగా మరో పిటిషన్ దాఖలు చేశారు. రాత్రంతా అసెంబ్లీలోనే ధర్నా చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. సమావేశాల రెండోరోజైన శుక్రవారం కూడా బలపరీక్షపై ఓటింగ్ చేపట్టకుండానే సభను వాయిదా పడటంతో ప్రభుత్వంపై మండిపడ్డారు.
గవర్నర్ లవ్ లెటర్ల నుంచి కాపాడండి: సీఎం
బలపరీక్షపై రెండో రోజు చర్చను ప్రారంభించిన సీఎం కుమారస్వామి మరోసారి బీజేపీపై మండిపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేకి రూ.50 కోట్లిచ్చి కొనుకున్నారని ఆరోపించారు. సీఎం కామెంట్స్పై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత యడ్యూరప్ప.. గవర్నర్ ఆదేశించినట్లు మధ్యాహ్నం 1:30లోగా ఓటింగ్ చేపట్టాలని స్పీకర్ను కోరారు. చర్చ పూర్తైన తర్వాతే ఓటింగ్కు వెళ్తానని, ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేననన్న స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. గడువు ముగియడంతో డెడ్లైన్ను సాయంత్రం 6:30కు పొడిగిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా సీఎంకు మరో లెటర్ పంపారు.‘‘ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బెదిరింపులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా వెంటనే ఫ్లోర్టెస్ట్ నిర్వహించండి’’అని అందులో పేర్కొన్నారు. సభ మళ్లీ ప్రారంభం కాగానే సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ సందేశాలను ‘లవ్ లెటర్స్’గా అభివర్ణించిన కుమారస్వామి.. వాటి నుంచి తనను కాపాడే బాధ్యత స్పీకర్పైనే ఉందన్నారు. ‘‘గవర్నర్ పట్ల నాకు చాలా గౌరవముంది. కానీ ఆయన పంపిన రెండో లవ్ లెటర్ నన్ను హర్ట్ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి గవర్నర్కు ఇప్పుడే తెలిసిందా? ఢిల్లీ(కేంద్రం) డైరెక్షన్ ప్రకారం నడుచుకునే సమస్యేలేదు. ఫ్లోర్ టెస్టు ఎప్పుడు చేపట్టాలన్నది మీరే(స్పీకరే) డిసైడ్ చేయండి. గవర్నర్గారి లవ్ లెటర్ల నుంచి నన్ను కాపాడండి”అని కుమారస్వామి అన్నారు.
చర్చ పూర్తయ్యాకే ఓటింగ్: స్పీకర్
అసెంబ్లీని వాయిదా వెయ్యొద్దని, అవసరమైతే రాత్రి 12 గంటల వరకైనా సభ పొడిగించి ఓటింగ్ చేపట్టాలన్న ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అభ్యర్థనను స్పీకర్ రమేశ్ కుమార్ తిరస్కరించారు. ‘‘సుప్రీంకోర్టుకు, ప్రజలకు, సభకు నిజానిజాలు తెలియాలి. చర్చ పూర్తైన తర్వాతే ఓటింగ్కు అనుమతిస్తా. ఎవరో బెదిరించడం వల్లే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని గవర్నర్(లేఖలో) అంటున్నారు. అదేంటో తేలాలి. స్పీకర్నైన నాక్కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క ఎమ్మెల్యే ఫిర్యాదు చెయ్యలేదు. నిజంగా అలాంటిది జరగనప్పుడు ఆ ఎమ్మెల్యేలు ప్రజల్ని మిస్లీడ్ చేసినట్లవుతుంది” అని స్పీకర్ రమేశ్ కుమార్ అన్నారు.
మళ్లీ కోర్టుకు చేరిన పంచాయితీ
ఫ్లోర్ టెస్టుపై వరుసగా డెడ్లైన్లు విధిస్తున్న గవర్నర్కు అసలు అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారాలు ఎంతవరకున్నాయో స్పష్టం చేయాలంటూ సీఎం కుమారస్వామి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2015నాటి ఉత్తరాఖండ్ సంక్షోభం సమయంలో గవర్నర్ పాత్రపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కుమారస్వామి ఉదహరించారు. రెబల్ ఎమ్మెల్యేలపై జరిగిన విచారణలో కాంగ్సెస్ పార్టీని కూడా చేర్చాలని కేపీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టును కోరారు. ఈనెల 17 నాటి తీర్పుతో విప్ అధికారాలపై అస్పష్టత ఏర్పడిందని, రెబల్ ఎమ్మెల్యేలకు విప్ వర్తిస్తుందో, లేదో క్లారిటీ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.