
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసేందుకు చర్యలు చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ ఘటనపై మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తమ ప్రభుత్వం చిన్న స్వామి స్టేడియంను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి తరలించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కొద్ది రోజుల కిందట జరిగిన ప్రమాదానికి తాను చింతిస్తున్నానని.. ఇలాంటివి భవిష్యత్తులో ఏ ప్రభుత్వంలోనూ జరగకూడదని భావిస్తున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోందని సీఎం చెప్పారు.
భద్రతా పరమైన కారణాల రీత్యా స్టేడియంను వేరే ప్రాంతానికి తరలిస్తామని సిద్ధరామయ్యం చెప్పారు. కొత్త స్టేడియం నిర్మాణానికి సంబంధించి.. అవసరమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారాయన. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే పబ్లిక్ ఈవెంట్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా చూసేందుకు.. భద్రత చర్యలను సమీక్షిస్తున్నట్లు వివరించారాయన.
ప్రమాదం తర్వాత దీనికి బాధ్యులను చేస్తూ ఐదుగురు పోలీసు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సీఎం పొలిటికల్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను సైతం మార్చేయటం గమనార్హం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.