కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్ దోచిపెడుతున్నారు

కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు కేసీఆర్ దోచిపెడుతున్నారు

పోతిరెడ్డిపాడు విషయంలో TRS ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి. కృష్ణా నీళ్ళను ఆంధ్రప్రదేశ్ కు సీఎం కేసీఆర్ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు నాగం జనార్థన్ రెడ్డి. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే బొంద పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే అగ్రిమెంట్ కు మించి అదనంగా 19 TMC నీళ్లు ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు అయ్యింది…అయినా పోతిరెడ్డపాడు పాత హెడ్ రెగ్యులేటరీని కేసీఆర్ ఎందుకు క్లోజ్ చేయలేదని ప్రశ్నించారు. కేఆర్ఎంబి సబ్ కమిటీ నివేదిక ప్రకారం పాత హెడ్ రెగ్యులేటర్ ద్వారా  70 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీకి వెళ్తున్నాయన్నారు. సంగమేశ్వర్ ద్వారా మళ్ళీ రోజుకు 3       TMC ల  నీళ్లను ఎత్తుక పోయేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కు ప్రతి ఏటా న్యాయంగా రావాల్సిన నీరు కూడా రావడం లేదన్న నాగం…ఇద్దరు సీఎం లు కలిసి నీటి దోపిడీ చేస్తున్నారన్నారు.

203 జీఓను వెంటనే రద్దు చేయించాలని డిమాండ్ చేశారు నాగం జనార్థన్ రెడ్డి. లేకపోతే కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు.