కేసీఆర్ పథకాలన్నీ ఎన్నికల కేంద్రంగానే

కేసీఆర్ పథకాలన్నీ ఎన్నికల కేంద్రంగానే
  • ఆయన పెట్టే పథకాలన్నీ ఎన్నికల కేంద్రంగానే ఉంటయ్​
  • దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన్రు: ఆప్ రాష్ట్ర ఇన్​చార్జ్​ సోమ్​నాథ్​ భారతి
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తామని వెల్లడి
  • కాళేశ్వరం కరెప్షన్ రాజా కేసీఆర్​:  ఇందిరా శోభన్

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ఖరీదైన ఎన్నికలు జరిగితే, ఆ క్రెడిట్ కేసీఆర్​కే దక్కుతుందని ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీ తెలంగాణ ఇన్​చార్జ్​ సోమ్​నాథ్ భారతి విమర్శించారు. ఎన్నికల ఖర్చులో కేసీఆర్ దేశంలోనే టాప్​లో ఉన్నారన్నారు. కేసీఆర్ అన్ని పథకాలు ఎన్నికల కేంద్రంగా ఉంటాయని దుయ్యబట్టారు. రూ. 2.56  లక్షల కోట్ల బడ్జెట్​లో ఎన్నికల కేంద్రంగా ఉన్న పథకాలకే ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేత ఇందిరా శోభన్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ దళితులను అన్ని విధాలుగా మోసం చేశారని మండిపడ్డారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం అన్ని ఉట్టివేనన్నారు. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం నుంచే పట్టుకొచ్చిన పార్టీలని, అయితే రెండు పార్టీల పాలన తీరులో చాలా తేడా ఉందని చెప్పారు. కేజ్రివాల్ సర్కార్ విద్యా రంగంపై బడ్జెట్ లో 25 శాతం కేటాయిస్తే.. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో విద్యా రంగానికి నిధుల్ని 10 నుంచి 6.26 శాతానికి తగ్గించిందన్నారు. క్షేత్రస్థాయిలో విద్యాసంస్థల అభివృద్ధి జరగపోయినా.. అంతా జరిగినట్లు ప్రజల్ని కేసీఆర్  పిచ్చివాళ్లను చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను నిరక్షరాస్యులు చేయడం, పేదలుగా ఉంచడం, అధికారం లేకుండా చేయడం కేసీఆర్ రాజనీతి అని దుయ్యబట్టారు.

హెల్త్ సెక్టార్ పై ఆప్ 13 శాతం ఖర్చు చేస్తే, తెలంగాణ సర్కార్ ఈ అంశంలో పోటీపడలేకపోయిందన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఇతర రంగాలపై ఆప్ సర్కార్ ఇంత ఖర్చు చేస్తున్నా... ప్రభుత్వ ఖజానాపై భారం పడడం లేదని, కానీ కేసీఆర్ పనులు పూర్తి చేయకున్నా రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో పనితీరు, పంజాబ్ లో ఆప్ కు దక్కిన ప్రజాధరణ చూసి, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ప్రజల నుంచి పిలుపువస్తున్నదని సోమ్​నాథ్ భారతి చెప్పారు. తెలంగాణలో పాదయాత్ర చేపడుతామన్నారు. 
విదేశాల్లో దాచుకోవడమే కేసీఆర్ విజన్: ఇందిరా శోభన్​
‘‘పదేండ్లకు సరిపడా ప్రజా ధనాన్ని దోచుకొని, విదేశాల్లో దాచుకోవడమే కాళేశ్వరం కరెప్షన్ రాజా కేసీఆర్ విజన్’’ అని ఆప్ తెలంగాణ సర్చ్ కమిటీ చైర్​ పర్సన్​ ఇందిరా శోభన్ విమర్శించారు. తెలంగాణపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ పెడుతున్నదని తెలిసి, కేసీఆర్ మన ఊరు – మన బడి ప్రోగ్రాం చేపట్టారని అన్నారు.  ఆప్ సర్కార్ ఢిల్లీలో చేస్తున్న మొహల్లా క్లినిక్ లను తెలంగాణలో బస్తీ దవాఖాన్ల పేరుతో కాపీ చేశారని చెప్పారు. అయితే, ఢిల్లీలోని క్లినిక్ ల ద్వారా దాదాపు 220 టెస్ట్ లు నిర్వహిస్తుంటే..తెలంగాణలోని బస్తీ దవాఖాన్లలో కేవలం ఒక డాక్టర్, ఆయన ఇచ్చే జ్వరం గోలీ తప్ప ఏమి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలను బూడిద పాలు చేసి, బొందల గడ్డ వైపు పంపుతున్నట్లు ఉందని మండిపడ్డారు.

తాను ఆర్టీఐలో అప్లయ్​ చేయగా.. ఎస్సీ, బీసీ, ఎంబీసీ, ఇతర వర్గాల నిధులకు సంబంధించి అనేక విషయాలు బయపడ్డాయన్నారు. 2014 నుంచి 2021 మార్చి వరకు ఎస్సీ కార్పొరేషన్  ద్వారా ఖర్చు చేసింది రూ. 13,015 కోట్లు మాత్రమేనని, అలాంటిది ఇప్పుడు దళిత బంధుకు రూ. 17 వేల కోట్లు ఖర్చు  పెడుతున్నామంటే, చెవిలో పూలు పెట్టడమేనని దుయ్యబట్టారు. ఎంబీసీ కార్పొరేషన్ కు పేరుకు రూ. 2 వేల కోట్లు పెట్టి, ఇందులో రూ. 3 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు స్పష్టమైందన్నారు.  అంటే, ఎంబీసీలోని 120 కులాలకు కేసీఆర్ ఇచ్చింది రూ. 3 కోట్లన్నారు.  2018 ముందస్తు ఎన్నికల సందర్భంగానే కేసీఆర్ ఈ నిధుల్ని కేటాయించారని,  ఆ తర్వాత పైసా ఇవ్వలేదన్నారు. వనపర్తి సభలో మహిళా ఫీల్డ్ ఆఫీసర్లు ఆందోళన చేస్తారన్న కారణంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.