- ఇతర సబ్సిడీలు కూడా రద్దయితయ్: సీఎం
- డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు లేటెస్ట్ వెపన్స్ వాడాలె
- స్కాట్లాండ్ యార్డ్ లెక్క కంట్రోల్ చేయాలె
- ఏ పార్టీ వారైనా.. ఎంతటివారినైనా ఊరుకోవద్దు
- అధికారులకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో గంజాయి సాగవుతున్న సమాచారాన్ని అధికార యంత్రాంగానికి అందించకపోతే ఆ ఊరికి రైతు బంధు, ఇతర సబ్సిడీలు రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చట్ట వ్యతిరేక చర్యలపై గ్రామస్తులంతా అప్రమత్తమై సర్కారుకు ముందస్తు సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆయన ఆదేశించారు. డ్రగ్స్పై శుక్రవారం ప్రగతి భవన్లో ఆబ్కారీ, పోలీస్ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. సినిమా, సోషల్ మీడియా తదితర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల కూడా డ్రగ్స్ వాడకం పెరిగిపోతున్నదని అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. సీఎం మాట్లాడుతూ.. డ్రగ్స్ను అరికట్టేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. మొదటి వ్యూహంలో డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారిని గుర్తించి, డీ అడిక్ట్ చేసేందుకు ప్లాన్ రూపొందించాలన్నారు.
మొదటి వ్యూహంలో ఇప్పటికే డ్రగ్స్కు అడిక్ట్ అయిన వారిని గుర్తించి, డీ అడిక్ట్ చేసేందుకు ప్లాన్ రూపొందించాలన్నారు. డ్రగ్ నెట్వర్క్ లింక్ను గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ప్లాన్గా చేపట్టాలని సూచించారు. డ్రగ్స్ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం లేటెస్ట్ వెపన్స్ను ఉపయోగించాలని, మరికొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ను అత్యంత అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేయాలన్నారు. ఎక్స్పర్ట్లు అయిన పోలీసులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్ మాఫియాపై విజృంభించాలని సీఎం ఆదేశించారు.
కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేసుకోవాలె
స్కాట్ లాండ్ యార్డ్ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించి, నిందితులను పట్టుకునే దిశగా పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. స్కాట్ లాండ్ యార్డ్ లెక్క డ్రగ్ కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి.. ట్రైనింగ్ తీసుకోవాలన్నారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని, రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని చెప్పారు. వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని, అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కోర్టుల్లో డ్రగ్స్ కేసులు వీగిపోకుండా, నేరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల సిఫారసులను తిరస్కరించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ కంట్రోల్కు సర్పంచులు, టీచర్లు, లెక్చరర్స్, స్టూడెంట్ల సహాయం తీసుకొని అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి మీడియా, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకోవాలని, డ్రగ్స్ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, డాక్యుమెంటరీలు, అడ్వర్టయిజ్మెంట్లకు సబ్సిడీలు అందించాలని చెప్పారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు.
డ్రగ్స్ అరికట్టేందుకు సీఎం చెప్పిన ద్విముఖ వ్యూహాలు
1. డ్రగ్స్కు అడిక్ట్ అయిన వాళ్లను గుర్తించి, డీ అడిక్ట్ చేయడం.
2. డ్రగ్ నెట్వర్క్ లింక్ను గుర్తించి నిర్మూలించడం.