రాజ్యాంగంపై విమర్శలు : కేరళ మంత్రి సాజీ రాజీనామా

రాజ్యాంగంపై విమర్శలు : కేరళ మంత్రి సాజీ రాజీనామా

తిరువనంతపురం : భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ ఒత్తిళ్ల మేరకు బుధవారం సాయంత్రం (జులై 6న) కేబినెట్‌ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. 

సాజీ చెరియన్‌ ఏమన్నారంటే..?
వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా భారత రాజ్యాంగాన్ని రాశారని సాజీ చెరియన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సాజీ చెరియన్‌ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను గవర్నర్ కోరారు.

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సాజీ చెరియన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తనకు భారత రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని, పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కూడా చెప్పారు.

సాజీ చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. బీజేపీ లేఖ రాయడం, చివరకు సొంత పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు సాజీ చెరియన్‌ రాజీనామా చేయక తప్పలేదు. 

సాజీ చెరియన్‌ రాజీనామా ఆమోదం

కేబినెట్‌ నుంచి వైదొలిగిన కేరళ మంత్రి సాజీ చెరియన్‌ రాజీనామాను కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆమోదించారు.