కేరళలో 12 మందికి సోకిన జికా వైరస్

కేరళలో 12 మందికి సోకిన జికా వైరస్

ఓ వైపు దేశం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరోవైపు కేరళలో జికా వైరస్ కేసులు బయటపడట ఆందోళన కలిగిస్తోంది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు 19 మంది శాంపిళ్లను పంపించగా.. వారిలో 12 మందికి జికా వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందు ఓ 24 ఏళ్ల గర్భవతికి పాజిటివ్ వచ్చింది. ఆమె ఈ నెల 7న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువులో ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని చెప్పారు. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

జికా వైరస్ సోకితే ఫీవర్, దద్దుర్లు, కండ్ల కలకలు, కీళ్ల నొప్పులు, తల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈ జికా వైరస్ ఏడెస్ దోమ వల్ల మనుషులకు వ్యాప్తి చెందుతోంది. ఏడెస్ దోమలు నిల్వ ఉన్న నీటిలో సంతానోత్పత్తిని చేస్తాయి. జికా వైరస్ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ బారినపడిన వారిలో కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలను కనిపించకపోవచ్చు. జికా వైరస్ గర్భవతులకు చాలా ప్రమాదం. కడుపులో పెరుగుతున్న బిడ్డపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ నియంత్రణకు ఎటువంటి టీకాలు కాని, మందులు కాని ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. జికా వైరస్ మొట్టమొదటిసారిగా 1947లో ఉగాండాలోని ఓ అడవిలో బయటపడింది.