![ఇప్పటి వరకు అగ్నిప్రమాదం జరిగిన భవనాలన్నీ అక్రమ కట్టడాలే: కిషన్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/01/kishan-reddy_meU3wzgMrW.jpg)
ఆదాయం కోసం అక్రమ నిర్మాణాలకు అనుమతివ్వొద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి. బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని చెప్పారు. చట్ట వ్యతిరేక గోడౌన్ లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్డింగ్ చుట్టుపక్కల వాళ్లు కూడా నష్టపోయారని... ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్లన్నీ అక్రమ కట్టడాలేనని తెలిపారు. బడ్జెట్ కోసం ప్రభుత్వం అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తుందని ఆరోపించారు.
మరో వైపు ఈ అగ్నిప్రమాదం ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మంటలు ఎగిసిపడుతుండటం, పొగ దట్టంగా వ్యాపించడంతో రెస్క్యూ కష్టంగా మారింది. ఐదు ఫ్లోర్లకు మంటలు వ్యాపించడంతో బిల్డింగ్ ఏ క్షణమైనా కుప్పకూలే అవకాశముందని అధికారులు అంటున్నారు. మరోవైపు బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించారు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండిపోయిన మరో ముగ్గురిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది. సహాయక సిబ్బంది ఆ అంతస్థులోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా మంటలు ఎగిసిపడుతుండటంతో సాధ్యం కావడం లేదు.