
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలకులు ప్రభుత్వ యూనివర్సిటీలు లేకుండా చేస్తున్నారని.. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరాం అన్నారు. ఉస్మానియాతో పాటు ఇతర వర్సిటీల పరిరక్షణ కోసం విద్యార్థులు ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సేవ్ ఉస్మానియా యూనివర్సిటీ.. ప్రభుత్వ యూనివర్సిటీలు.. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగన్న, పద్మజ హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థుల ఎదుగుదల యూనివర్సిటీల్లోనే ఉంటుందని, అలాంటి వర్సిటీల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లు లేకుండా చేస్తున్నదని విమర్శించారు. హాస్టళ్లలో కనీస వసతులు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. నేటి పాలకులకు భూమి మీద ఉన్న శ్రద్ధ వర్సిటీలపై లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య కోసం.. యూనివర్సిటీల బాగు కోసం పాలకుల మార్పు అవసరమని విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రహించాలని కోదండరాం సూచించారు.
ఆకునూరి మురళి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ప్రభుత్వ యూనివర్సిటీలు బాగుపడతాయన్నారు. ప్రపంచం విశ్వవిద్యాలయాకు ఖర్చు పెడుతుంటే.. తెలంగాణలో మాత్రం బడ్జెట్ కేటాయించకుండా, ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంబటి నాగన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ పోరాటాలకు మూలవిరాట్ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు.
నిజాం నవాబులు అద్భుతమైన ఓయూ బిల్డింగ్స్ ఇస్తే.. ప్రభుత్వానికి మాత్రం ఓయూ భూములు కనబడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ మనువాదానికి కేరాఫ్ గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.