శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

శ్రేయస్ అయ్యర్‎కు గాయం.. గ్రౌండ్‎లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్

చంఢీఘర్: ఐపీఎల్ 19లో భాగంగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్సింగ్స్‎లో రషీద్ ఖాన్ వేసిన 11 ఓవర్ 5వ బంతిని పంజాబ్ బ్యాటర్ కూపర్ కానలీ స్ట్రైట్ హిట్ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్ ఎండ్‎లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కుడిచేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో అయ్యర్ గ్రౌండ్‎లో కుప్పకూలిపోయాడు. గ్రౌండ్‎లో నేలపై పడుకోని నొప్పితో విలవిలాడిపోయాడు.

వెంటనే గ్రౌండ్‎లోకి పరిగెత్తుకొచ్చిన పంజాబ్ ఫిజియోలు అయ్యర్ ను పరీక్షించారు. బంతి తగిలిన చోట ఐస్‌ ప్యాకులు పెట్టడంతో పాటు పెయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టారు. నొప్పితోనే తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన అయ్యర్ (18) కాసేపటికే ప్రసిద్ కృష్ణ బౌలింగ్‎లో వాషింగ్టన్ సుందర్‎కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయ్యర్ గాయపడి మైదానంలో కుప్పకూలిపోవడంతో పంజాబ్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయం తీవ్రంగా ఉంటే మాత్రం పంజాబ్‎కు ఇది భారీ ఎదురు దెబ్బే. 

ఇక, మ్యాచ్ విషయానికి వస్తే ఆల్ రౌండ్‎ షోతో అదరగొట్టిన పంజాబ్ ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‏ను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 రన్స్ చేసింది. గిల్ 39, బట్లర్ 38, ఫిలిప్స్ 25 రన్స్ చేశారు. విజయ్ వైశాఖ్ మూడు వికెట్లతో రాణించగా.. చాహల్ రెండు వికెట్లు, యాన్సెన్ ఒక వికెట్ తీశారు. అనంతరం జీటీ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ విజయవంతంగా ఛేదించి గెలుపుతో టోర్నీని ఆరంభించింది. కూపర్ కూనలీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ కు విజయాన్ని అందించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.