హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్బండ్ శివ కుమారుడు వేణుమాధవ్కు హోం గార్డు ఉద్యోగం ఇస్తూ అందుకు సంబంధించిన నియామకపత్రాన్ని అందజేశారు.
ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా ఘటనల్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)లో పడిన ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడారు. అయితే, కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి స్పందించారు.
శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివ కుటుంబం ముఖ్యమంత్రిని కలిశారు.
ఉపాధి కోసం ట్యాంక్బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.
సహృదయంతో స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్బండ్ శివ కుటుంబ సభ్యులు అన్నారు.
