
బెంగళూరు: ఇన్నాళ్లూ తమపై నమ్మకాన్ని పెట్టుకున్న అభిమానులకు ఐపీఎల్–18 విజయాన్ని అంకితమిస్తున్నామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్ అన్నారు. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్కు భారీగా వచ్చిన ప్రేక్షకులను ఉద్దేశించి విరాట్ మాట్లాడాడు. ‘మన కెప్టెన్ రజత్ పటీదార్ ట్రోఫీ ప్రదానోత్సవంలో చెప్పిన దానిని నేను పునరావృతం చేస్తున్నా. ఇకపై ఈ సాలా కప్ నమదే కాదు. ఈ సాలా కప్ నమ్దు. ఇదంతా మీ కోసమే. ఈ అభిమానులు, అద్భుతమైన నగర ప్రజలు, ఆర్సీబీని అన్ని విధాలుగా ఆదరించినవాళ్లకు ఈ విజయం అంకితం. ఈ ఫ్రాంచైజీ లాంటి అభిమానులను నేను ప్రపంచంలో ఏ జట్టులోనూ చూడలేదు’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. పటీదార్ను కెప్టెన్గా ప్రకటించినప్పుడే తనలో దీర్ఘకాలిక నాయకత్వ సామర్థ్యాన్ని తాను అంచనా వేసినట్లు కోహ్లీ వెల్లడించాడు.
కెప్టెన్గా తన తొలి సీజన్లోనే అతను నిరూపించుకున్నాడని కొనియాడాడు. ఇక తాను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నమస్కార బెంగళూరుతో ప్రారంభించడం చాలా గొప్పగా ఉంటుందని కెప్టెన్ పటీదార్ అన్నాడు. ‘ఈ సీజన్ ప్రారంభం నుంచి మేం ఏం చేయాలో అందరికీ స్పష్టంగా తెలుసు. మీరందరూ ట్రోఫీకి అర్హులు. మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఇది మాకు ఓ గొప్ప క్షణం’ అని పటీదార్ పేర్కొన్నాడు. అహ్మదాబాద్ నుంచి చార్టెడ్ ఫ్లైట్లో మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ జట్టుకు ఎయిర్పోర్టులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విధాన సౌధ ముందు సీఎం సిద్ధరామయ్యతో కలిసి ప్లేయర్లను ఘనంగా సత్కరించారు. సాంప్రదాయమైన మైసూర్ పేట (తలపాగా)ను చుట్టి, పూల మాలతో పాటు ప్రత్యేకమైన జ్ఞాపికలను అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్లేయర్లతో ముచ్చటించి వారితో ఫొటోలు దిగారు. అయితే స్టేడియానికి బయలుదేరే ముందు వర్షం పడటం, ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండటంతో ఓపెన్ టాప్ బస్ విక్టరీ పరేడ్ను రద్దు చేశారు. ఫ్రాంచైజీకి చెందిన రెండు బస్సుల్లో ప్లేయర్లందరూ చిన్నస్వామి స్టేడియానికి వెళ్లారు. ఫ్యాన్స్కు ట్రోఫీ చూపిస్తూ అభివాదం చేశారు.
బయట విషాదం.. లోపల సంబరం
బెంగలూరు స్టేడియం బయట తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోయినా.. గ్రౌండ్లో ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, భారీ సెక్యూరిటీ మధ్య గ్రౌండ్లోకి వచ్చిన ఆర్సీబీ జట్టు, అధికారులకు బయట జరిగిన ప్రమాదం తీవ్రత గురించి తెలియదని తెలుస్తోంది. ఫ్యాన్స్..కోహ్లీ, కోహ్లీ.. అంటూ నినాదాలు చేయడంతో విరాట్ మాట్లాడేందుకు ఇబ్బందిపడ్డాడు. ‘నన్ను మాట్లాడనివ్వండి’ అంటూ పదేపదే కోరినా ఫ్యాన్స్ కేరింతలు, అరుపులు మాత్రం ఆపలేదు. దాంతో కొద్దిసేపే మాట్లాడిన కోహ్లీ వెంటనే పటీదార్కు మైక్ ఇచ్చేశాడు.