చేనేత కుటుంబాలను ఆదుకోండి : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

చేనేత కుటుంబాలను ఆదుకోండి : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

చేనేత రంగాన్ని ఆదుకోవాలని ప్రధాని మోడీని కోరారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  కార్మికులకు మూడు నెలల లాక్ డౌన్  కాలంలో కనీసం 3వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరారు. వారికి పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి వెూడీకి లేఖ రాశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కరోనా వైరస్‌ కట్టడిని సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టడమే కాకుండా అయా దేశాలకు వైద్య సహకారం అందిస్తున్న ప్రధానిని అభినందించారు. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ ప్యాకేజీలో భాగంగా చేనేత వృత్తులకు , చేతి వృత్తిదారులకు నిధులు కేటాయించాలని కోరుతూ లేఖలో రాశారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతి పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి విస్తరించకుండా విధించిన లాక్ డౌన్‌ కారణంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్న చేనేత, చేతి వృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2019 గణంకాల ప్రకారం 31 లక్షల కుటుంబాలు, 45 లక్షల మంది ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.