ఓటమి భయంతోనే పార్టీ పేరు మార్చిండు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఓటమి భయంతోనే పార్టీ పేరు మార్చిండు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. 9 ఏళ్ల క్రితం కల్వకుంట్ల కుటుంబ ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. మునుగోడులో అడ్డదారిలో గెలిచిన కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారని అన్నారు. 

రాష్ట్రంలో నిజమైన కురక్షేత్రం ముందుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని..మోడీ హయాంలోనే కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేయొచ్చని భావిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. వెయ్యి మందికిపైగా ఆత్మబలిదానాలు చేసుకుంటే ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగడం బాధాకరమన్నారు. రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూం తదితర  పథకాలన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తానని మాట తప్పిన కేసీఆర్.. కనీసం ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. అధికారం, డబ్బుతో ఎన్నికల్లో  గెలుస్తామనే ధీమా BRS ఉంటే.. బీజేపీ వైపు ధర్మం, ప్రజాబలం ఉన్నాయన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపిచేందుకు  ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.