
- ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో పాటు వేం నరేందర్ రెడ్డిపైనా ఫిర్యాదు
హైదరాబాద్/వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా విమర్శలు చేసిన అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. భారీ కాన్వాయ్, పెద్ద సంఖ్యలో అనుచరగణంతో ఆయన గాంధీ భవన్ వచ్చారు. గంటకు పైగా క్రమ శిక్షణ కమిటీతో సమావేశమైన కొండా మురళి.. ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశశ్విని రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై ఆరు పేజీల ఫిర్యాదు లేఖను క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందజేశారు.
మంత్రి సీతక్కతో తనకు, కొండా సురేఖకు ఎలాంటి ఇబ్బందులు లేవని, మంత్రి పొంగులేటిపైనా తాను ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని అందుకే గాంధీ భవన్కు వచ్చానని తెలిపారు. తనను ఎవరూ పిలవలేదని, ఎవరూ ప్రశ్నించలేదని, తాను ఎవరికీ వివరణ ఇవ్వలేదని చెప్పారు.
కాంగ్రెస్ లో చేరే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, తనపై ఫిర్యాదు చేసిన వాళ్లు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలని అన్నారు. మంత్రి కొండా సురేఖపై జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యతో కలిసి కక్షకట్టారని మురళి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి గతంలో సురేఖపై పోటీ చేశాడని, సురేఖ బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తే..నరేందర్రెడ్డికి మాత్రం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు.
వరంగల్ జిల్లాలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో తామే కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడి ఎమ్మెల్యేలను గెలిపించామని మురళి పేర్కొన్నారు. జిల్లా నుంచి మరో మంత్రి సీతక్కతో తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తమపై తప్పుడు వార్తలు రాపిస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేపిస్తున్నాడని లేఖలో తెలిపారు.
పిలిస్తేనే మురళి వచ్చారు: మల్లు రవి
పీసీసీ క్రమశిక్షణ కమిటీ పిలిస్తేనే కొండా మురళి గాంధీ భవన్ కు వచ్చారని ఆ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం తెలిపారు. వరంగల్జిల్లా ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని మురళిని కోరామన్నారు. మంచి వాతావరణంలో మురళితో సమావేశం జరిగిందన్నారు. ఆసిఫాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న విబేధాలపై కమిటీకి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంకు సంబంధించి నేతల మధ్య గొడవకు సంబంధించి లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలని కోరానని చెప్పారు.