
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఐపీఎల్ కప్ విక్టరీ తర్వాత జరిగిన తొక్కిసలాటలో 11 మంది క్రికెట్ అభిమానులు చనిపోయారు. ఈ ఘటన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ను కుదిపేస్తుంది. ప్రభుత్వంపై మొదట విమర్శలు చేసిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ లో ఇప్పుడు ముసలం మొదలైంది. చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ అసోసియేషన్ సభ్యులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు.
కర్ణాటక క్రికెట్ అసోసియేసన్ (KSCA) కార్యదర్శి శంకర్, కోశాధికారి జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు రోజులుగా జరిగిన ఊహించని పరిణామాలు దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు. అసోసియేషన్ కు తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా.. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాం. అసోసియేషన్ పాత్ర చాలా చాలా తక్కువ.. పరిమితంగానే ఉంది.. అయినా మాపై విమర్శలు రావటం బాధకలిగించింది.. క్రికెట్ అభిమానులను కోల్పోయాం.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు కార్యదర్శి, కోశాధికారి వెల్లడించారు.
చిన్నస్వామి క్రికెట్ స్టేడియం గేట్ల నిర్వహణ, అభిమానుల రద్దీని నియంత్రించాల్సిన బాధ్యత అసోసియేషన్ ది కాదని.. ఇదంతా శాంతి భద్రతల కిందకు వస్తుంది అంటూ ఇప్పటికే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హైకోర్టుకు తన అఫిడవిట్ దాఖలు చేసింది. తొక్కిసలాటతో సంబంధం లేదని.. ఐపీఎల్ యాజమాన్యానిదే తప్పు అంటూ తన వైఖరి స్పష్టం చేసింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన 24 గంటల్లోనే.. అసోసియేషన్ కు చెందిన కార్యదర్శి, కోశాధికారి రాజీనామా చేయటం విశేషం.