
- దోషులెవరో.. నిర్దోషులెవరోతేలుతది: కేటీఆర్
- సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే నోటీసులుఅని ఫైర్
హైదరాబాద్, వెలుగు:పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నోటీసుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో వేషం కడుతూ తనపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘పదేండ్ల కింద నోట్ల కట్టలు ఉన్న బ్యాగుతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆ ఏసీబీ కేసు ఇంకా పెండింగ్లో ఉందనేది గుర్తుంచుకోవాలి. మన ఇద్దరిలో దోషి ఎవరో.. నిర్దోషి ఎవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్గా లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఉందా? నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం.
మరి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా?” అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్కు ఏసీబీ నోటీసుల ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్పందించారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా పంపిన రూ.44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఆ నిధులను వెనక్కి రప్పించడం చేతగాని సీఎం.. తనకు మరోసారి ఏసీబీ నోటీసులు పంపారన్నారు. హైదరాబాద్ సిటీ, తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా ఆపేశారని మండిపడ్డారు.
చట్టాలను గౌరవించే వ్యక్తిగా.. సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరై అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ సీఎంగా నిస్సిగ్గుగా అసమర్థతను చాటుకుంటున్నారని, ఇలాంటి సమయంలో విచారణల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయడం మానుకోవాలని సూచించారు.