టిమ్స్ లో ప్రపంచ స్థాయి వైద్యం...అత్యాధునిక టెక్నాలజీ, ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాం: కేటీఆర్

టిమ్స్ లో ప్రపంచ స్థాయి వైద్యం...అత్యాధునిక టెక్నాలజీ, ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాం:  కేటీఆర్
  •     కేసీఆర్​ ప్రభుత్వం వచ్చి ఉంటే రెండేండ్ల కిందటే పూర్తయ్యేదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సిటీ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలన్న లక్ష్యంతో టిమ్స్​ హాస్పిటల్స్​ నిర్మాణాన్ని తమ ​హయాంంలో చేపట్టామని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే.. బీఆర్ఎస్​ హయాంలో అత్యాధునిక టిమ్స్  హాస్పిటల్స్ కు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఎయిమ్స్​ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతోనే వాటికి రూపకల్పన చేశామని తెలిపారు. సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​తో కలిసి శుక్రవారం టిమ్స్​ హాస్పిటల్​ను కేటీఆర్  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనత్​నగర్​ టిమ్స్​నిర్మాణాన్ని అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో 22 ఎకరాల్లో ప్రారంభించామన్నారు. 

ప్రైవేట్  కార్పొరేట్  ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతోనే 1200 కోట్ల ఖర్చుతో 300 ఐసీయూ బెడ్లతో కేసీఆర్​ వాటిని తీసుకొచ్చారన్నారు. కేసీఆర్​ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆస్పత్రి రెండేండ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వీఐపీ సూట్స్, కిడ్నీ వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు సహా అన్ని సౌలతులూ కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం వరంగల్​లో 2 వేల పడకలతో నిర్మితమవుతున్న వరంగల్​ సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా కేసీఆర్​ హయాంలోనే వచ్చిందన్నారు. నిమ్స్​ విస్తరణ కూడా తమ హయాంలోనే మొదలైందని పేర్కొన్నారు.