నేను రాను.. అమెరికా వెళ్తున్నా.. తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా: ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై

నేను రాను.. అమెరికా వెళ్తున్నా.. తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా: ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28న  విచారణకు హాజరుకాలేనని ఏసీబీకి బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ రిప్లై ఇచ్చారు.  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తన లండన్, అమెరికా టూర్​ ముందే ఖరారైనందున హాజరు కాలేకపోతున్నానని బదులిచ్చారు. రాజకీయంగా వేధించేందుకే తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని, అయినా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని  స్పష్టం చేశారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కచ్చితంగా విచారణకు వస్తానని ఏసీబీ అధికారులకు కేటీఆర్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.

ఫార్ములా ఈ కార్​ రేసు కేసులో ఈ నెల 28న విచారణకు హాజరుకావాలన్న ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ద్వారా డబ్బులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి పేరును ఈడీ చార్జిషీట్‌‌లో నమోదు చేసిందని కేటీఆర్ తెలిపారు. సరిగ్గా 24 గంటల తర్వాత ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా కనిపించారని వెల్లడించారు. ఈ రోజు తనకు నోటీసులు వచ్చాయని తెలిపారు. మనీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఈడీ పేర్కొన్నప్పటికీ ఒక్క తెలంగాణ బీజేపీ నేత కూడా ఆయన్ను ఒక్క మాట కూడా అనలేదని, ఇది ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన, అనైతిక సంబంధానికి నిదర్శనమని మండిపడ్డారు.
 
నాపై ప్రతీకారంతో రగిలిపోతున్నరు
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలను  ప్రశ్నిస్తున్నందుకు రగిలిపోతున్న రేవంత్ రెడ్డి.. తనపై ప్రతీకారంతో ఎంతకైనా దిగజారుతారన్న సంగతి ఈ ఏసీబీ నోటీసులతో అర్థమైందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి నాయకుడిగానే కాకుండా, మనిషిగా కూడా ఎంతగా పతనం అవుతున్నారో చెప్పడానికి ఈ చౌకబారు ప్రతీకార  చర్యలే నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ను చూస్తే రేవంత్ లో రోజురోజుకూ భయం పెరిగిపోతున్నదని అన్నారు.