బీజేపీ ఎన్నో ర‌కాల కుట్ర‌లు, కుతంత్రాలకు ప్లాన్ చేసింది

బీజేపీ ఎన్నో ర‌కాల కుట్ర‌లు, కుతంత్రాలకు ప్లాన్ చేసింది

హైద‌రాబాద్: గత 22 రోజులుగా బీజేపీ ఎన్నో రకాల పన్నాగాలు,కుట్రలు, కుతంత్రాలు చేసిందని, చివరికి డబ్బులు పంచడానికి కూడా సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నాయ‌కులు మొదట డబ్బుల ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారని, ఆదివారం కూడా కోటి రూపాయలు దొరికాయని కేటీఆర్ తెలిపారు. అభ్యర్థికి చేయి విరిగినట్లు, బీజేపీ అధ్యక్షుడిని కొట్టినట్లు చిల్లర డ్రామా చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కేటీఆర్. బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్త ఆత్మహత్యాయత్నంతో చివరి కుట్రకు తెరలేపారని ఆరోపించారు. కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి నిరసనగా రేపు ప్రగతి భవన్ గాని, డీజీపీ కార్యాలయం గానీ, టీఆర్ఎస్ కార్యాలయ ముట్టడి గాని చేయాలనుకుంటున్నారని..త‌మ‌కు విశ్వసనీయ సమాచారం ఉంద‌న్నారు. లాఠీచార్జీ, ఫైరింగ్ జరిగే స్థాయిలో ఆందోళన చేసే కుట్రకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలకు పాల్పడి దుబ్బాకలో ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ తీరుపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తామని, అలాగే డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ తెలిపారు.