V6 చేతిలో కర్నూలు బస్సు ప్రమాద FIR కాపీ.. ఏ1, ఏ2గా వాళ్లిద్దరి పేర్లు !

V6 చేతిలో కర్నూలు బస్సు ప్రమాద FIR కాపీ.. ఏ1, ఏ2గా వాళ్లిద్దరి పేర్లు !

హైదరాబాద్: V6 చేతిలో కర్నూల్ బస్సు ప్రమాద ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం గానే ప్రమాదం జరిగినట్లు FIR కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఇద్దరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ఏ1 గా వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ను నిందితుడిగా పోలీసులు చేర్చడం గమనార్హం. రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 

డ్రైవర్తో పాటు ఓనర్పై పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. BNS 125(a)తో పాటు 106(1) సెక్షన్లను కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీసులు నమోదు చేశారు. హైదరాబాద్​ నుంచి బెంగుళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌‌ బస్సు శుక్రవారం తెల్లవారుజామున ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది.

ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్ద బస్సు బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు సహా మొత్తం19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఇద్దరు డ్రైవర్లు, నలుగురు చిన్నారులు సహా మొత్తం 46 మంది ఉన్నారు. లోపల దట్టమైన పొగ వ్యాపించడం, హైడ్రాలిక్​ డోర్​ తెరుచుకోకపోవడంతో అశ్విన్​రెడ్డి అనే ప్రయాణికుడు డ్రైవర్​సీటు వెనుకాల ఉన్న చిన్న మిర్రర్​పగులగొట్టుకొని బయటకువచ్చాడు. ఆయన వెంట వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికులు బస్సు వెనుక ఉన్న అద్దాన్ని పగుల గొట్టడంతో అందులోంచి మరో 21 మంది దూకారు. కానీ బస్సు ముందు భాగంలో ఉన్నవారంతా బయటకు రాలేక, మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు ఉండగా.. ఏపీకి చెందిన ఆరుగురు, కర్నాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరిది బిహార్, ఒకరిది ఒడిశా కాగా.. మరొకరిది ఏ రాష్ట్రమో గుర్తించాల్సి ఉంది.  రాత్రి 9:30 గంటలకు పటాన్‌‌‌‌‌‌‌‌చెరు నుంచి బయలుదేరిన బస్సు ఆరాంఘర్‌‌‌‌‌‌‌‌ మీదుగా బెంగళూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూట్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశించింది. ప్రయాణికుల కోరిక మేరకు మధ్యలో ఒకచోట బస్సు ఆపారు. ఆ తర్వాత రాత్రి  2:30 నుంచి 3 గంటల మధ్య బస్సు కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఉలిందకొండ మండలం చిన్నటేకూరు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో 100కు పైగా స్పీడ్‌‌తో వెళ్తున్న బస్సు.. దాని ముందు రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొంది.

ఈ క్రమంలోనే బస్సు ముందు భాగంలో బైకు ఇరుక్కోగా, దాన్ని దాదాపు 300 మీటర్ల దూరంఈడ్చుకెళ్లింది. సరిగ్గా అప్పుడే నిప్పు రవ్వలు చెలరేగడం, బైక్‌‌‌‌‌‌‌‌  ట్యాంక్ నుంచి పెట్రోల్‌‌‌‌‌‌‌‌ లీక్ కావడంతో మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌ బస్సును ఆపి, మరో డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిద్రలేపాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్స్​తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో బస్సు ముందుభాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.