వానలు పడుతున్నా..హైదరాబాద్ లో పూడికతీత పూర్తికాలే

వానలు పడుతున్నా..హైదరాబాద్ లో పూడికతీత పూర్తికాలే
  • 73 శాతం కంప్లీట్​ చేశామన్నంటున్న జీహెచ్ఎంసీ
  • గ్రౌండ్​ లెవెల్​లో సీన్​ వేరే
  • చాలాచోట్ల అడ్డుగా ఉన్న వ్యర్థాలను కూడా తొలగించలే 
  • ఈసారి రూ.55 కోట్లు కేటాయింపు  
  • త్వరలోనే పూర్తి చేస్తామంటున్న అధికారులు  


హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలం వచ్చినా నగరంలో నాలాల పూడికతీత పనులు ఇంకా పూర్తి కాలేదు. మే నెల చివరలో లేదా ఈ నెల మొదటివారంలోగానే మొత్తం పనులు పూర్తి చేయాలని బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నా​ రీచ్ ​కాలేకపోయారు. ఇప్పటివరకు 73 శాతం పనులు చేశామని చెప్తుండగా, ఫీల్డ్​లెవెల్​కి వెళ్లి చూస్తే వాస్తవం వేరేగా ఉంది. చాలా నాలాల్లో కనీసం అడ్డుగా ఉన్న వ్యర్థాలను కూడా తొలగించలేదని స్థానికులు చెప్తున్నారు. మే నెల మొత్తం అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయని, 73 శాతం నాలాల్లో పూడికతీత పూర్తి చేశామన్న అధికారుల ప్రకటన వాస్తవం కాదంటున్నారు..

రూ.55 కోట్లతో 203 పనులు 

బల్దియా ప‌‌‌‌రిధిలో దాదాపు వెయ్యి కిలోమీట‌‌‌‌ర్ల మేర వ‌‌‌‌ర్షపు నీటి కాలువలు ఉండగా..ఇందులో మేజ‌‌‌‌ర్ నాలాలు 398 కిలోమీట‌‌‌‌ర్లు, పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలోమీట‌‌‌‌ర్లకు పైగానే ఉన్నాయి. అయితే, ప్రతి ఏటా పూడికతీత కోసం జీహెచ్ఎంసీ  రూ.40 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ నాలాల పూడికతీత ఎప్పుడూ అధికారులకు వరంగానే మారింది. గత బీఆర్ఎస్​హయాంలో నాలాల పూడికతీత పేరిట అక్రమాలు చేశారన్న ఆరోపణలున్నాయి.  పదేండ్ల నుంచీ రెండేండ్లకు ఒక్కసారి కూడా నగరంలోని నాలాల్లో వందశాతం పూడికతీత పనులు చేయడంలేదు. కొన్ని నాలాల్లో  అడ్డుగా ఉన్న వ్యర్థాలనూ తొలగించలేకపోతున్నారు. 2020లో వరదలు వచ్చినప్పుడు నాలాలు ఎక్కడికక్కడ బ్లాక్ అయి ఉప్పొంగాయి. తర్వాత కూడా నామమాత్రపు పనులు చేసి వదిలేశారు.  2021, 2022లో పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ గుర్తించింది. 2021లో నాలాల పూడికతీతకి సంబంధించి రూ.44 కోట్లతో పనులు చేసినప్పటికీ, సగానికిపైగా నాలాల్లో పూడిక తీయలేదని గుర్తించి 15 మంది ఇంజినీర్లకు షోకాజ్​నోటీసులు ఇచ్చారు. 2022లోనూ నాలాల పూడికతీతకి సంబంధించి 38మంది అధికారుల వేతనాల్లో కమిషనర్ కోతలు విధించారు.  

వార్నింగ్ ​ఇచ్చినా మారని పద్ధతి 

నాలాల పూడికతీత విషయంలో అవినీతి, అక్రమాలను గుర్తించిన జీహెచ్ఎంసీ రెండున్నరేండ్ల కింద పూడికతీత పనులపై స్పెషల్​ఫోకస్ పెట్టింది. పూడికతతీ విషయంలో తేడాలు వస్తే స్థానిక సర్కిల్ ఇంజినీర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పనుల్లో అవినీత,అక్రమాలు జరిగితే వారినే బాధ్యులను చేస్తామని స్పష్టం చేసింది. ఈ ఏడాది రూ.55 కోట్లతో 203 పనులు చేపట్టాలని నిర్ణయించినా ఇంకా పూర్తి కాలేదు. దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నా స్థానికులు తమ దగ్గర నాలాల్లో ఏ మార్పు కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయని, భారీ వానలు పడితే రోడ్లు, గల్లీలోకి  మురుగు వస్తుందని నాలాల సమీపంలోని బస్తీ, కాలనీల వాసులు భయపడుతున్నారు. పనులు పూర్తి చేయకపోవడంపై  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సీఎంతో బల్దియా కమిషనర్​ సమావేశం కాగా,  ముఖ్యమంత్రి నాలాల పూడికతీత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.