ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున వాదించినందుకు బెదిరిస్తున్రు

ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున వాదించినందుకు బెదిరిస్తున్రు

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున వాదించినందుకు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లాయర్ కరుణ సాగర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దుబాయి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అంతు చూస్తామని అంటున్నారని తెలిపారు. ఒక న్యాయవాదిగా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చానే తప్ప ఎవరికి వ్యతిరేకంగా పనిచేయలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ అరెస్ట్ సమయంలో  పోలీసులు చట్టపరంగా వ్యవహరించలేదని, అందువల్లే రిమాండ్ రిజక్టయ్యిందన్నారు. 41 సీఆర్‌‌పీసీ నిబంధనలు పాటించనందువల్లే రాజాసింగ్ కు బెయిల్ వచ్చిందని లాయర్ తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న ఆయన... బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. 

ముస్లింలను కించపరిచేలా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. పలు చోట్ల ఆయనకు వ్యతిరేకంగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. అయితే అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌‌పీసీ, సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించలేదన్న కోర్టు... రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ తరపున కరుణ సాగర్ కోర్టులో వాదించారు.