తక్షణం ఖర్కివ్ నుంచి కదలండి: ఇండియన్స్‌కు సెకండ్ అడ్వైజరీ

తక్షణం ఖర్కివ్ నుంచి కదలండి: ఇండియన్స్‌కు సెకండ్ అడ్వైజరీ

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతుండడంతో క్షణ క్షణానికీ పరిస్థితులు మారిపోతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు రెండో పెద్ద సిటీ అయిన ఖర్కివ్ లను తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఎప్పుడు ఎలాంటి దాడి జరుగుతుందోనన్న ఆందోళన నెలకొనడంతో భారత ప్రభుత్వం తక్షణం అప్రమత్తమైంది. రెండ్రోజుల క్రితమే కీవ్ నుంచి భారత పౌరులు, స్టూడెంట్స్ ను బయటపడాలని సూచించిన కేంద్రం ఇవాళ ఖర్కివ్ ను ఖాళీ చేసి వచ్చేయాలని ఎమర్జెన్సీ గైడ్ లైన్స్ జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే ఖర్కివ్ నుంచి దాటి రావాలని ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ప్రకటన చేసింది. అంతలోనే మరోసారి సెకండ్ గైడ్ లైన్స్ జారీ చేసింది.

16 కిలోమీటర్ల దూరమే.. వచ్చేయండి

ఖర్కివ్ లో ఉన్న భారత పౌరులు వేగంగా ఆ సిటీ నుంచి బయటపడాలని ఇండియన్ ఎంబసీ ఆదేశించింది. పిసోచిన్,  బబాయ్, బెజ్లియుడోవ్కాల్లో ఏదో ఒక చోటికి రావాలని సూచించింది. బస్సు, ట్రైన్ ఏది దొరికితే అందులో బయలుదేరాలని, ఏ వెహికల్ దొరకని పక్షంలో కాలి నడకనైనా ఖర్కివ్ నుంచి బయటపడాలని సెకండ్ అడ్వైజరీలో పేర్కొంది. ఖర్కివ్ నుంచి పిచోచిన్ కు 11 కిలోమీటర్లు, బబాయ్ కు 12 కిలోమీటర్లు, బెజ్లియుడోవ్కాకు 16 కిలోమీటర్లు దూరం ఉంటుందని, ఈ పరిస్థితుల్లో సేఫ్టీ, సెక్యూరిటీ దృష్టా ఎలాగోలా ఆ ప్రాంతాలకు చేరుకోవాలని ఎంబసీ సూచించింది. ఉక్రెయిన్ టైమ్ ప్రకారం సాయంత్రం 6 గంటల్లోపు (ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 9.30 గంటలు) ఎలాగైనా సరే ఖర్కివ్ దాటాలని నొక్కి మరీ చెప్పింది.

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన విద్యార్థులను సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు చేరుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ బీభత్సం మధ్య భారతీయులకు ఎటువంటి హాని చేయకుండా ఉండేలా ప్రధాని మోడీ.. ఉక్రెయిన్, రష్యా దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ మేరకు  భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని వెళ్తే హాని చేయబోమని రెండు వైపుల నుంచి హామీ ఇచ్చింది. దీంతో మన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సిటీల నుంచి జాతీయ జెండాలతో సరిహద్దు వరకూ చేరుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది.