ఎల్ఈడీ ధగధగ.. ఆరోగ్యానికి సెగ

ఎల్ఈడీ ధగధగ.. ఆరోగ్యానికి సెగ
  •                 వెలుగులు విరజిమ్మే నగరాల్లో  సిటీ టాప్​​
  •                 లైట్​ పొల్యూషన్​తో చిక్కులు
  •                 అంతరిస్తున్న నిశాచర జీవులు
  •                 చీకటి కరువై
  •                 రోగాల బారిన ప్రజలు

హైదరాబాద్, వెలుగు :

హైదరాబాద్ లో విద్యుత్ కాంతి పెరిగిపోతోంది. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి స్థానిక సంస్థలు ఎల్ఈడీ లైట్లతో నగరాన్ని వెలిగించడంతో, సహజమైన చీకటి కనిపించకుండా పోతోంది. దీంతో దేశంలోనే వెలుగుల దివ్వెగా హైదరాబాద్ నిలిచినప్పటికీ.. నగరవాసులను అనారోగ్యానికి గురిచేస్తోందని, అదే విధంగా నిశాచర జీవుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంతర్జాతీయ పరిశోధన పత్రంలో వెల్లడైంది.

ఒకప్పుడు రాత్రిళ్లు అరుగు మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తుంటే.. మిణుకుమిణుకు మంటూ కనిపించే చుక్కలు మెరిసేవి. కానీ మారుతున్న కాలానుగుణంగా సహజంగా ఉండే చీకటి కూడా కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఆధునిక విద్యుద్ధీపాలు, జిగేల్​మనే లైటింగ్ ఎఫెక్టులతో చిమ్మ చీకట్లో కూడా సాయంత్రం పూట ఉండే వెలుతురు కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ విద్యుదీకరణలో భాగంగా విపరీతంగా పెరిగిన కృత్రిమ లైట్లతో నగర వాసులపైనే కాకుండా జీవజాతుల లైఫ్ సైకిల్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాస్తవానికి లైట్ పొల్యుషన్ గా పిలిచే ఈ కృత్రిమ లైట్లతో నగర వాసుల్లో ఎక్కువగా నిద్రలేమి, ఊబకాయం, డిప్రెషన్, డయాబెటిస్ వంటి రుగ్మతల బారిన పడుతున్నారని తేలింది.

లైట్ పొల్యూషన్ పై పరిశోధన సాగిందిలా…

భువనేశ్వర్ కు చెందిన సెంచురియన్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘లైట్ పొల్యూషన్ ఇన్ ఇండియా’ అంశంపై ప్రొ. సిబా ప్రసాద్ మిశ్రా ప్రాతినిధ్యంలో పరిశోధనలు చేశారు. ఈ రీసెర్చ్​లో దేశంలోనే అత్యధిక కృత్రిమ వెలుగులను విరజిమ్మే నగర జాబితాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కోల్ కత్తా, న్యూ ఢిల్లీ ఉండగా చిట్టచివరన భువనేశ్వర్ నగరం ఉంది. ఆర్టిఫిషీయల్ లైటింగ్ తో పెరుగుతున్న కాంతితీవ్రతను లెక్కించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరిశోధనల్లో స్పష్టమైంది. దీనికోసం 2014 నుంచి 2017 వరకు శాటిలైట్ చిత్రాల ఆధారంగా దేశంలో కొంత కాలంగా వాతావరణంలోకి విడుదలవుతున్న కృత్రిమ కాంతి తీవ్రతను లెక్కించారు. ఈ గణాంకాల్లో హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నయ్, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో మూడేళ్లలో 102% పెరిగిందని తేలింది. దీంతో తీవ్రమైన ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా వృక్ష, జంతు జాలానికి జీవన శైలిలో పలు మార్పులకు కారణమవుతుందని స్పష్టమైంది.

నగరంలో కనుమరుగవుతున్న చిమ్మచీకటి

గ్లోబల్ సిటీ వైపు వడివడిగా అడుగులేస్తున్న హైదరాబాద్ నగరంలో ఆర్టిఫీషియల్ లైటింగ్ తో రాత్రి పూట కనిపించే చీకటి దూరమైపోతోంది. సిటీలో ప్రధాన రోడ్లతోపాటు, ఓఆర్ఆర్, వీధి దీపాలన్నింటిని ఎల్ఈడీ లైట్లతో ఆధునీకరించారు. ప్రస్తుతం ఐదు లక్షల ఎల్ఈడీ లైట్లు రాత్రంతా వెలుగుతుండగా, సంస్థలు, కార్యాలయాలపై ఉండే విద్యుత్ దీపాలు, లైటింగ్ హోర్డింగులు, డెకరేటివ్ లైట్లతో వచ్చే కృత్రిమ విద్యుత్ కాంతి ధగధగలతో ఆకాశంలోకి ప్రసారమయ్యే కాంతి తీవ్రత విపరీతంగా పెరగగా, నగరంలో కాంతి తీవ్రత 7790 ల్యూమినస్/చదరపు మీటర్ గా ఉంది. అయితే 2014 నుంచి 2017 వరకు కాంతి తీవ్రత 102% శాతానికి చేరిందని, ఎల్ఈడీ లైట్ల వాడకంతో వాతావరణంలోకి వెదజల్లే కాంతి తీవ్రత పెరగడానికి కారణమైందని పరిశోధనల్లో తేలింది. అయితే నగరంలో గాలి, నీళ్లలో జరుగుతున్న కాలుష్యంతో పోల్చితే ఆ స్థాయిలో కాంతి కాలుష్యం ప్రమాదకరమైనది కాకపోయినా, భవిష్యత్తులో లైఫ్ సైకిల్ పై ప్రభావం చూపనుంది. విపరీతమైన విద్యుత్ కాంతులతో రాత్రిళ్లు పనిచేసేవారు కంటి సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని కంటి వైద్య నిపుణులు సరోజినీ దేవీ కంటి వైద్యులు రవీందర్ గౌడ్ తెలిపారు. రాత్రి పూట చీకటి తగ్గిపోవడంతో పక్షుల మనుగడకు ఇబ్బంది కలుగుతుందని, పక్షుల్లో ఉండే నావిగేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని, గబ్బిలాలు, గుడ్లగూబల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుందని జీవావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చీకటి తగ్గితే అనారోగ్య సమస్యలే

రాత్రిపూట ఉండే చీకటి తగ్గిపోయి, లైటింగ్ పెరిగితే జనాలపై కూడా ఆరోగ్య ప్రభావం చూపుతుందని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట మెలకువతో ఉండే వారిలో కలిగే నిద్రలేమి, కంటి చూపు తగ్గడంతోపాటు, రొమ్ము క్యాన్సర్  ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి మానసికంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.  ప్రధానంగా సెక్సువల్ డిజార్డర్ల బారిన పడే ప్రమాదం పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.