నల్లగొండ జిల్లా : నదీ జలాల్లో తెలంగాణ కు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తారని చెప్పారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. చిట్యాల పట్టణం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లపై కృష్ణా రివర్ బోర్డ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ పిర్యాదు చేసారు. బోర్డ్ కూడా ఏపీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని తప్పు పట్టిందని.. ప్రాజెక్ట్ ను నిలుపుదల చేయాలని ఆదేశించిందని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు ,అర్హత లేదన్నారు గుత్తా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతుంటే కనీసం నోరు కూడా మెదపలేదని.. అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నానా రాద్ధాంతం చేస్తూ, ముఖ్యమంత్రి పై అభాండలు వేయడం సరైంది కాదని అన్నారు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలగనివ్వరని చెప్పారు.