నల్గొండ జిల్లా రాజపేటలో చిరుత హల్ చల్ చేసింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కిన చిరుత.. మత్తుమందు ఇచ్చే క్రమంలో తప్పించుకుంది. కొంత కాలంగా మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గ్రామస్థుల సమాచారంతో అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు బోన్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే పులికోసం ఏర్పాటు చేసిన కంచెలో బుధవారం రాత్రి చిరుత చిక్కింది.
దీంతో ఘటన స్థలానికి ప్రత్యేక అంబులెన్స్ లో చేరుకున్న ఫారెస్ట్ అధికారులు, పులి దగ్గరకు ఎవరూ వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి తరలించే క్రమంలో చిరుత ఫారెస్ట్ అధికారులపై దాడి చేసి తప్పించుకుంది. దీంతో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న చిరుత కోసం గాలించిన అధికారులు.. ఎట్టకేలకు పట్టుకున్నారు. బోనులో బంధించిన చిరుతను హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ కు తరలించారు అటవీశాఖ అధికారులు. చిరుత దొరకడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.